
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్పై విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్లో సూపర్ నోవాస్ ఫీల్డర్ నట్టకమ్ చాంటమ్ రిస్కీ ఫీల్డింగ్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగురుతూ ఈ థాయ్ లాండ్ మహిళా క్రికెటర్ ఆపిన తీరు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. సూపర్ నోవాస్ ఇన్నింగ్స్ సందర్భంగా జెమీమా రోడ్రిగ్స్ కొట్టిన షాట్ను నట్టకన్ సర్కస్ ఫీట్లా కాళ్లను గాల్లోకి లేపి చేతులతో బంతిని ఆపింది. టీవీ రిప్లేలో ఆమె చేసిన ఈ రిస్కీ ఫీల్డింగ్కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
అయితే నట్టకన్కు ఏమైనా గాయమైందా? అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ట్విటర్ వేదికగా ఈ మహిళా సూపర్ ఫీల్డర్ స్పందించింది. తనకేం కాలేదని, బాగానే ఉన్నానని ట్వీట్ చేసింది. 'నా మెడకు ఏమైందని అడిగిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి గాయం అవ్వలేదు. నొప్పిలేదు. కొంచెం ఐస్ పెట్టా అంతే'అని ట్వీట్ చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించింది.
అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి.