టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. టీమిండియాలో అతను లేని లోటు స్పష్టంగా కనబడుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ లోటు తనకు చాలా సార్లు కనిపించందని, ముఖ్యంగా ఆఖరి టెస్ట్లో అతను లేకపోవడం స్పష్టంగా తెలిసొచ్చిందన్నారు. అతను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈ దేశానికి అతని అవసరం ఉందని ట్వీట్ చేశారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి సెషన్లో టీమిండియా పైచేయి సాధిస్తే.. రెండో సెషన్లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. ఆఖరి సెషన్లో పుంజుకున్న భారత్.. ఇంగ్లండ్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ వెలుతురు లేమి, వర్షం కారణంగా నాలుగో రోజు ఆటను అంపైర్లు నిర్ణీత సమం కన్నా ముందే ముగించారు.

మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 111), జోరూట్(152 బంతుల్లో 12 ఫోర్లతో 105) శతకాలతో సత్తా చాటగా... బెన్ డకెట్( 83 బంతుల్లో 6 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో జెమీ ఓవర్టన్(0 బ్యాటింగ్), జెమీ స్మిత్(2 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్కు నాలుగు వికెట్లు కావాలి.
మహమ్మద్ సిరాజ్ ఫీల్డింగ్లో చేసిన తప్పిదం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న సిరాజ్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్.. టీమిండియాను శతక్కొట్టాడు. ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగడం కూడా టీమిండియాకు నష్టం చేసింది. స్పిన్నర్లు ప్రభావం చూపకపోవడంతో పేసర్లు అదనపు భారాన్ని మోయలేకపోయారు. ఆకాష్ దీప్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్ చేశాడు.
హ్యారీ బ్రూక్, జో రూట్ 195 పరుగుల భాగస్వామ్యంతో భారత విజయవకాశాలను దెబ్బతీసారు. ఈ ఇద్దరూ ఆడుతున్న సమయంలో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశగా కనిపించాడు. గెలవాలనే కసి ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. కోహ్లీలా దూకుడుగా ఉంటూ ఆటగాళ్లు ఉత్సాహపరిచే ఆటగాడు మైదానంలో కనిపించలేదు. ఈ మ్యాచే కాదు.. ఈ సిరీస్ మొత్తం కోహ్లీలా సహచర ఆటగాళ్లలో కసిని రేకెత్తించే ప్లేయర్ను భారత్ మిస్సయ్యింది. దీన్ని ఉద్దేశించే శశి థరూర్ ట్వీట్ చేశారు.
'ఈ సిరీస్లో కొన్నిసార్లు విరాట్ కోహ్లీ లేని లోటు నాకు స్పష్టంగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో అతన్ని నేను చాలా మిస్సయ్యాను. అతని పట్టుదల, దూకుడు, మైదానంలో సహచర ఆటగాళ్లను ఉత్సాహపరిచే అతని విధానం, అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ సిరీస్లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని అతన్ని కోరడం ఇప్పటికే ఆలస్యమైందనుకుంటా..? విరాట్.. ఈ దేశానికి నువ్వు కావాలి.'అని శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లండన్లోనే ఉంటున్న కోహ్లీ.. కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.