
ఇక్కడే సేఫ్..
ఈ క్రమంలో క్రికెట్ డాట్ కమ్ ఏయూతో మాట్లాడిన కౌల్టర్నైల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. వారికుండే పరిస్థితుల్ని బట్టే వారి నిర్ణయాలు ఉంటాయి. ఆడమ్ జంపా తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్దపడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపై రిచర్డ్సన్ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వారితో మాట్లాడితే విషయం అర్థమవుతుంది. నేను జంపాతో మాట్లాడాను. వెళ్లాల్సిన పరిస్థితుల్లో తప్పక వెళ్లాల్సి వస్తుందన్నాడు. జంపా, రిచర్డ్సన్ నిర్ణయాలను గౌరవిస్తున్నా. నాకైతే బయోబబుల్ వాతావరణం బాగుంది. ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే సేఫ్ అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ సీజన్లో కౌల్టర్నైల్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ పేస్ విభాగం బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నేలతో బలంగా ఉండటంతో కౌల్టర్నైల్కు ఇంకా ఆడే అవకాశం రాలేదు.

ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతుంటే..
ఓవైపు కరోనా వైరస్తో దేశం ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, ప్రభుత్వాలు, కంపెనీలు వేల కోట్ల రూపాయాలను ఎలా ఖర్చుపెడుతున్నాయని రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై ప్రశ్నించాడు. అలాగే భారత్లో ఐపీఎల్కు ఉన్న క్రేజ్, ఈ కఠిన పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మానసిక ఉల్లాసాన్ని తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు. 'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందనే విషయం నాకు తెలుసు. ముఖ్యంగా ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలకు అదెంతో మేలు చేస్తుంది. ఈ కారణంతోనే వారు ఐపీఎల్ను కొనసాగిస్తుండవచ్చు. కానీ అందరూ ఇదే అభిప్రాయంతో ఉంటారని మాత్రం నేను అనుకోవడంలేదు. నేను అన్నీ కోణాల్లో నుంచి అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. 'అని ఆండ్రూ టై తెలిపాడు. రాజస్థాన్ టీమ్ తరఫున అతను ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.

కుటుంబం కోసం అశ్విన్..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్, టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ముగిసిన అనంతరం అతను ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తమ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారని, వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
పరిస్థితులు చక్కడిన తర్వాత అవకాశం ఉంటే మళ్లీ మైదానంలోకి దిగుతానని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












