
తీరిక లేని షెడ్యూలే..
ఇక మ్యాచ్ రద్దవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా.. తీరిక లేని షెడ్యూలే ఈ పరిస్థితికి కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కాలమ్లో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత బృందంలో కరోనా వైరస్ సోకిన వెంటనే కొంతమంది ఐపీఎల్ గురించి ఆలోచించారన్నాడు.
దురదృష్టం కొద్దీ క్రికెట్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పరోక్షంగా ఐపీఎల్నుద్దేశించి వ్యాఖ్యానించాడు. 'ఐపీఎల్ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఇంతకుముందే ఐదో టెస్టును ముందుగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేసింది. ఐపీఎల్ లీగ్ భారత ఆటగాళ్లకు ముఖ్యం.. అందులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి' అని నాసర్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ సైతం..
ఏ జట్టు అయినా ఇలా మ్యాచ్ ఆడకుండా తప్పుకొంటే ఎవరూ ఏమీ చేయలేరన్నాడు. ప్రస్తుతం దీన్ని రీషెడ్యూల్ చేసే పరిస్థితులు లేనందున భవిష్యత్లో ఎప్పుడైనా సర్దుబాటు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. ఇందులో టీమిండియా ఆటగాళ్లని తప్పుపట్టడం సరికాదని, గత డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లూ వెనకడుగు వేశారని గుర్తుచేశాడు. అప్పుడు కొంతమంది ఆటగాళ్లు బిగ్బాష్ లీగ్కు వెళ్లాలని చూశారని, మరికొందరు తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారని మాజీ కెప్టెన్ వివరించాడు.

ఐపీఎల్ కోసమే..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి నోరుపారేసుకున్నాడు. ఐపీఎల్ కాసుల కోసమే టీమిండియా.. కొవిడ్ను సాకుగా చూపిందనే విధంగా తన కాలమ్లో రాసుకొచ్చాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ఇదంతా డబ్బు, ఐపీఎల్ కారణంగానే జరిగింది. ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోననే భయంతోపాటు ఐపీఎల్కు దూరమవుతామనే ఆందోళన వల్లే మాంచెస్టర్ టెస్టు రద్దయింది'అని వాన్ రాసుకొచ్చాడు.
అంతటితో ఆగకుండా ఐపీఎల్తో కాకుండా ఇతర కారణాలతో మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని చెప్పకండని ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ టీమ్స్ ప్రత్యేక విమానాల్లో తమ ఆటగాళ్లను తరలిస్తున్నాయి. ఆటగాళ్లు ఆరు రోజుల క్వారంటైన్లో ఉండాలి. లీగ్కు ఇంకా ఏడు రోజుల సమయం ఉంది. మాంచెస్టర్ టెస్ట్ రద్దుకు ఐపీఎల్ కాకుండా ఇతర కారణాలున్నాయని చెప్పకండి'అని వాన్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ సుద్దపూస కాదు..
ఇక ఇంగ్లండ్ మీడియా, మాజీ ఆటగాళ్ల విమర్శలకు భారత అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. 'డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన 'హండ్రెడ్' కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్ను విమర్శించడంలో అర్థం లేదు.'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరీస్ను కొంచెం ముందుకు జరిపినా.. రెండో, మూడో టెస్ట్ మధ్య విరామాన్ని తగ్గించినా ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని భారత మాజీ క్రికెట్ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు సిరీస్ బాయ్కట్ చేసిందని నిలదీశాడు.


Click it and Unblock the Notifications












