రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టైటిల్ గెలిస్తే ఆ జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ ఆగడని, అతన్ని తట్టుకోలేమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ అథర్టన్, నాసర్ హుస్సేన్ అన్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ఆర్సీబీ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. స్కై స్పోర్ట్స్ ఛానెల్లో ఐపీఎల్ ఫైనల్ గురించి చర్చ జరగ్గా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరిన ఆర్సీబీ టైటిల్ గెలిస్తే.. ఆ జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ తమను ఆడుకుంటాడని నాసర్ హుస్సేన్ అనగా.. రెండింత చికాకు తెప్పిస్తాడని మైఖేల్ అథర్టన్ చెప్పాడు.
గతంలో దినేశ్ కార్తీ స్కై స్పోర్ట్స్ కామెంటేటర్గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో కలిసి కామెంట్రీ ప్యానెల్ను పంచుకున్న దినేశ్ కార్తీక్ తనదైన వ్యాఖ్యానంతో వారిని ఆటపట్టించేవాడు. ఈ క్రమంలోనే మెంటార్గా కెరీర్ ప్రారంభించిన దినేశ్ కార్తీక్ తొలి ఏడాదే టైటిల్ గెలిస్తే.. తమను ఓ ఆట ఆడుకుంటాడని చెప్పారు.

'ఆర్సీబీ ఫైనల్ చేరింది. ఆ జట్టు టైటిల్ గెలిస్తే దినేష్ కార్తీక్ మమ్మల్ని ఓ ఆట ఆడుకుంటాడు. ఈ సీజన్తోనే అతను కోచ్గా కెరీర్ ప్రారంభించాడు.'అని నాసర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. 'మాములుగానే దినేశ్ కార్తీక్ను తట్టుకోవడం కష్టం. ఇక ట్రోఫీ గెలిస్తే రెండింతలు మమ్మల్ని ఆడుకుంటాడు. ఆర్సీబీ విజయయోత్స వేడుకల్లో కోహ్లీతో కలిసి ట్రోఫీని పట్టుకుంటాడు.'అని మైఖేల్ అథర్టన్ అన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ సక్సెస్ క్రెడిట్ దినేశ్ కార్తీక్దేనని చెప్పాడు. మెగా ఆక్షన్ నుంచి అతను జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సక్సెస్ అయిన దినేశ్ కార్తీక్.. వారి నుంచి ఫలితాలను కూడా రాబడుతున్నాడు. మ్యాచ్ మధ్యలోనూ కీలక వ్యూహాలు రచిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫిల్ సాల్ట్, జోష్ హజెల్ వుడ్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం వెనుక దినేశ్ కార్తీక్ ఉన్నాడు.