సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. రావల్పిండి వేదికగా మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో నసీమ్ షా అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. సల్మాన్ అఘా(87 బంతుల్లో 9 ఫోర్లతో 105) సెంచరీతో రాణించగా.. హుస్సేన్ తలత్(63 బంతుల్లో 6 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36 నాటౌట్) దూకుడుగా ఆడాడు. సైమ్ అయుబ్(6), బాబర్ ఆజామ్(29), మహమ్మద్ రిజ్వాన్(5) వైఫల్యంతో పాకిస్థాన్ 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సల్మాన్ అగా, హుస్సేన్ తలత్ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 138 పరుగులు జోడించారు.

శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(3/54) మూడు వికెట్లు తీయగా.. అసితా ఫెర్నాండో, మహీష్ తీక్షణ తలో వికెట్ తీసారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగులు చేసి ఓటమిపాలైంది. వానిందు హసరంగ(52 బంతుల్లో 7 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(4/61) నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా, ఫహీమ్ అష్రఫ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
చివరి 12 బంతుల్లో శ్రీలంక విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. 49వ ఓవర్ వేసిన నసీమ్ షా క్రీజులోసెట్ అయిన హసరంగాను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. వికెట్ తీయడమే కాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. తీక్షణ రెండు బౌండరీలు బాదినా ఫలితం లేకపోయింది. నసీమ్ షా బౌలింగ్లో ఒక్క బౌండరీ వచ్చినా ఫలితం మరోలా ఉండేది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.