భారత్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఫైనల్ వేదికగా ఖరారు చేసినట్లు సమాచారం. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ముగిసిన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్పై ఐసీసీ కసరత్తులు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆతిథ్య దేశం అయిన భారత్ వేదికల ఎంపికపై కార్యచరణను మొదలుపెట్టింది. ఫైనల్తో సహా లీగ్ మ్యాచ్లకు సంబంధించిన వేదికల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి బీసీసీఐ సమర్పించాల్సి ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్పై సభ్యదేశాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఐసీసీ మార్పులు చేర్పులు చేస్తుంది. ఆ తర్వాతే షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తారు. తాజా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ముంబై నగరాలను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వేదికగా 6 మ్యాచ్లు జరగనున్నాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారం కారణంగా పాకిస్థాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె, గాలే వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ చేరితే తుది పోరుకు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది.
అహ్మదాబాద్లో ఫైనల్ అంటే భారత అభిమానులు జంకుతున్నారు. గతంలో ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఓడింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఫైనల్ను అచ్చొచ్చిన ముంబై వేదికగా నిర్వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్ స్టేజ్లో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లు చేయనున్నారు. రౌండ్ రాబిన్ పద్దతిన ప్రతీ జట్టు తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో తలపడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో తలపడుతుంది. రెండు గ్రూప్స్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి.
టీ20 ప్రపంచకప్ వేదికలకు సంబంధించిన షార్ట్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మైదానాలు లేవు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు వైజాగ్లోని ఏసీ-వీడీసీఏ క్రికెట్ స్టేడియాలను ఎంపిక చేయలేదు. దాంతో తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మైదానాలకు మ్యాచ్లు కేటాయించాలని కోరుతున్నారు.