Najmul Shanto: బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత్ చేతిలో ఓటమి పాలయ్యామని బంగ్లాదేశ్ తాత్కలిక కెప్టెన్ నజ్ముల్ షాంటో తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం భారత్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నజ్ముల్ షాంటో.. లిట్టన్ దాస్ ఇంకాసేపు ఆడి ఉంటే మెరుగైన స్కోర్ చేసేవాళ్లమని తెలిపాడు.
అప్పుడు ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. 'భారత్ ఎప్పుడూ బలమైన జట్టే. ఈ రోజు కూడా ఆ జట్టు తమ సత్తా ఏంటో చూపించింది. భారతే కాదు అన్నీ జట్లు బలమైనవే. కానీ ఈ రోజు మేం మా బెస్ట్ క్రికెట్ ఆడలేదు. తదుపరి మ్యాచ్ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం కోలుకున్నాడు. తదుపరి మ్యాచ్ వరకు అందుబాటులోకి వస్తాడు.

తాన్జిద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్లు కూడా పర్వాలేదనిపించారు. అసలు సమస్య ఏంటంటే.. బ్యాటింగ్లో సరైన ముగింపు అందుకోలేదు. లిట్టన్ దాస్ ఇంకాసేపు ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మా బ్యాటింగ్ యూనిట్ మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్లా(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 46), ముష్ఫికర్ రహీమ్(46 బంతుల్లో ఫోర్, సిక్స్తో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసింది. కోహ్లీ అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ రెండు వికెట్లు తీయగా.. హసన్ మహముద్ ఓ వికెట్ పడగొట్టాడు.