Najmul Hossain Shanto: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ తీవ్ర చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో అనేక నాటకీయ పరిణామాల మధ్య కోహ్లీ సెంచరీ పూర్తవ్వగా.. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యక్తిగత రికార్డుల కోసమే కోహ్లీ ఆడాడని కొందరు విమర్శిస్తే.. వైడ్ బాల్ విషయంలో అంపైర్ తప్పు చేశాడని ఇంకొందరు.. ఉద్దేశపూర్వకంగానే బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసే ప్రయత్నం చేశాడని మరికొందరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మ్యాచ్కు హాజరైన ప్రతీ ప్రేక్షకుడు విరాట్ కోహ్లీ సెంచరీ మూమెంట్ను ఎంజాయ్ చేశారు. భారత్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ పూర్తవ్వడానికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 42వ ఓవర్ బౌలింగ్ చేసిన నసుమ్ తొలి బంతిని వైడ్గా వేసాడు. దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ అంపైర్ వైడ్గా ప్రకటించలేదు. దాంతో కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది శతక గర్జన చేశాడు.
వైడ్ ఇవ్వకుండా అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని కొందరంటుంటే.. నిబంధనలకు లోబడే అంపైర్ వైడ్ ఇవ్వలేదని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. గతేడాది మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) వైడ్ నిబంధనను మార్చడంతోనే ఆ బంతిని అంపైర్ వైడ్ ఇవ్వలేదని వివరణ ఇస్తున్నారు.

రూల్ 22.1లో ఉన్నదే అంపైర్ పాటించాడని, అతను ఏం తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. బౌలర్ తన రనప్ ప్రారంభించినప్పుడు బ్యాటర్ మూవ్మెంట్ ఇచ్చి.. బ్యాటింగ్ పొజిషన్కు వెళ్లినా.. కదిలిన చోటునే పరిగణలోకి తీసుకోవాలని, ఆ ప్లేస్ను బట్టే వైడ్ నిర్ణయాన్ని ప్రకటించాలని ఈ నిబంధనల్లో ఉందని వివరిస్తున్నారు.
మరోవైపు తాము ఉద్దేశపూర్వకంగా వైడ్ వేయాలనుకోలేదని బంగ్లాదేశ్ తాత్కలిక కెప్టెన్ నజ్ముల్ షాంటో తెలిపాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అతను ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. 'విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైడ్ వేయలేదు. అది సహజంగా జరిగిందే. ఎలాంటి ప్రణాళికతో వేసింది కాదు. ఏ బౌలర్ కూడా ఉద్దేశపూర్వకంగా వైడ్ వేయాలనుకోరు. మంచి గేమ్ ఆడటానికి మేం ప్రయత్నించాం.'అని నజ్ముల్ షాంటో స్పష్టం చేశాడు.