భారత్ను తక్కువ స్కోర్కు కట్టడి చేయాలనే తమ ప్రణాళిక బెడిసికొట్టిందని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు. భారత బ్యాటర్ల అసాధారణ ప్రదర్శన, తమ చెత్త బ్యాటింగ్ ఘోర పరాజయానికి కారణమైందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియాతో శనివారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో బంగ్లాదేశ్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. నజ్ముల్ హొస్సేన్ షాంటో(32 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40), టన్జిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లతో 29), రిషద్ హొస్సేన్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 ) రాణించారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/19) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యాకు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నజ్ముల్ హొస్సేన్ షాంటో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ను 160-170 పరుగులకు కట్టడి చేయాలని భావించాం. కానీ భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. సూపర్ బ్యాటింగ్తో మా విజయవకాశాలను దెబ్బతీసారు. పిచ్ వాతావరణం, బలమైన గాలులు మా ఓటమికి ఏ మాత్రం సాకులు కావని చెప్పాడు. బ్యాటింగ్లో మేం దారుణంగా విఫలమయ్యాం. సరైన ఇంటెంట్తో బ్యాటింగ్ చేయలేకపోయాం.
190 పరుగుల లక్ష్యచేధనలో పవర్ ప్లేలో మేం దూకుడుగా ఆడాల్సింది. కానీ అలా చేయలేదు. నా బ్యాటింగ్తో బంగ్లాదేశ్ను గెలిపించే ప్రయత్నం చేశాను. తంజిమ్ సకిబ్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. రిషద్ కూడా సత్తా చాటాడు. మేం చాలా రోజులుగా ఓ లెగ్ స్పిన్నర్ కోసం ఎదురు చూస్తున్నాం. రిషద్తో ఆలోటు తీరింది.'అని నజ్ముల్ హొస్సేన్ షాంటో చెప్పుకొచ్చాడు.