భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్పై సౌతాఫ్రికా ఆల్రౌండర్ నదినే డీ క్లెర్క్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ మూమెంటమ్ను దెబ్బ తీసేందుకు రిచా ఘోష్ గాయం డ్రామా ఆడిందని ఆరోపించింది. అయితే ఈ డ్రామా వల్ల తమకే లాభం చేకూరిందని స్పష్టం చేసింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో నదినే డీ క్లెర్క్(84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో భారత్ పతనాన్ని శాసించింది. అయితే ఈ మ్యాచ్ చివర్లో మైదానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
క్రాంతి గౌడ్ వేసిన 47వ ఓవర్లో నదినే డీక్లెర్క్ తొలి మూడు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి మ్యాచ్ను తమవైపు మలుపు తిప్పుకుంది. ఆ సమయంలోనే రిచా ఘోష్ గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు ఆమె చికిత్స చేశారు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఫిజియోల చికిత్సతో కోలుకున్న రిచా ఘోష్ ఎలాంటి అసౌకర్యం లేకుండా వికెట్ కీపింగ్ చేసింది. దాంతో రిచా ఘోష్ గాయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో రిషభ్ పంత్ కూడా ఇలానే గాయం డ్రామా ఆడి సౌతాఫ్రికా మూమెంటమ్ను దెబ్బతీసాడు. రిచా ఘోష్ కూడా అదే చేయబోయిందా? అనే మాటలు వినిపించాయి. కానీ ఈ ప్లాన్ టీమిండియాకు వర్కౌట్ కాలేదు. తన జోరును కొనసాగించిన డి క్లెర్క్.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..రిచా ఘోష్పై ఆరోపణలు గుప్పించింది. 'రిచా ఘోష్ది గాయం కాదు. డ్రామాలా అనిపించింది. ఆమె గాయం గురించి మేం ప్రశ్నించాం. మా మూమెంటమ్ను దెబ్బతీయడానికి ఆమె పన్నిన వ్యూహం ఇది. ఇది డ్రామా అని మేం గ్రహించాం. అయితే ఈ సమయం మాకు కలిసొచ్చింది. కాస్త విశ్రాంతి తీసుకొని మా ఆట ప్రణాళికలను సమీక్షించుకున్నాం.'అని నదినే డీక్లెర్క్ చెప్పుకొచ్చింది.
ప్రత్యర్థి జట్ల మూమెంటమ్ను బ్రేక్ చేయడానికి మైదానంలో ఆటగాళ్లు గాయం డ్రామా ట్రిక్కును వాడుతున్నారు. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే చర్చ జరుగుతుంది. ఇలాంటి పనులు చేయకుండా ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. తాజాగా రిచా ఘోష్ వ్యవహారంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.