కొలంబో: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ జట్టని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ తెలిపాడు. ప్రస్తుతం తనకు ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడే అవకాశం వస్తే చెన్నై జట్టుకే ఎంపిక కావాలని కోరుకుంటానని తెలిపాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడానికి ముందు మరళీధరణ్ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్ ఐపీఎల్లోని తన అనుభవాలను పంచుకున్నాడు. అంతేకాకుండా చెన్నై సూపర్కింగ్స్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 'నేను ఐపీఎల్ మాత్రమే కాకుండా అనేక దేశాల్లో వివిధ ఫ్రాంచైజీలకు ఆడాను. వాటన్నింటిలోకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టే బెస్ట్. ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్కు 6 నుంచి 7 సంవత్సరాలు ప్రాతినిథ్యం వహించాను. కానీ చెన్నై సూపర్ కింగ్స్కు కేవలం 3 సంవత్సరాలే ఆడాను. అయినప్పటికీ సీఎస్కేనే నాకు గొప్ప'అని మురళీ స్పష్టం చేశాడు.
ఇక లీగ్ ప్రారంభంలో లోకల్ ఆటగాళ్లను ఆడించాలనే రూల్ ఉండేదని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 'లీగ్ ప్రారంభమైన తొలి మూడేళ్లు నాకు చాలా బెస్ట్. ఎందుకంటే మేం మా సొంత భాషలో మాట్లాడుకునేవాళ్లం. వీబీ చంద్రశేఖర్ సర్తో సహా జట్టులో 7 నుంచి 8 మంది వరకు తమిళులం ఉన్నాం. మమ్మల్ని ఆయనే జట్టులోకి తీసుకున్నారు.'అని మురళీ చెప్పుకొచ్చాడు. ఇక 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్లో చెన్నై తరపున బరిలోకి దిగిన మురళీధరణ్ 40 మ్యాచులు ఆడి 40 వికెట్లు పడగొట్టాడు.
ఇక ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. టెస్ట్ ఫార్మాట్లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్గా చరిత్రకెక్కారు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.