
కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ ప్రశంసల జల్లు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలర్లు ఉపయోగించుకోవడంలో ధోనీ మాస్టర్ అని, ఇప్పుడు ఆ పనిని కోహ్లీ తలకెత్తుకున్నాడని కొనియాడాడు. ఆటగాళ్లలో స్ఫూర్తినింపడంలో భారత కెప్టెన్లు ఎప్పుడూ ముందుంటారని తెలిపాడు. తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ, కోహ్లీలను కొనియాడిని ఈ పాక్ స్పిన్నర్.. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. బౌలింగ్ మెరుగుదలకు కొన్ని సూచనలు చేశాడు.
'బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకోవడం వల్ల టీమిండియా మూడు ఫార్మాట్లలో ఆధిపత్యం కనబరుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బౌలర్లు ఉపయోగించుకోవడంలో ధోనీ మాస్టర్. ప్రస్తుతం ఆ పనిని విరాట్ చేస్తున్నాడు.'అని తెలిపాడు.
'చహల్ క్రీజును మరింత బాగా వాడుకోవాలి. బ్యాట్స్మెన్ సామర్థ్యానికి తగినట్లు ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం తెలియాలి. నేనెప్పుడు బంతితో కాకుండా ఫీల్డర్లతోనే అటాక్ చేసేవాడిని. ఈ పద్దతిని అర్థం చేసుకుంటే సక్సెస్ కావచ్చు. ఒకవేళ బంతిపై పట్టు చిక్కనప్పుడు క్రీజుకు కాస్త ఎడంగా ఉండి బౌలింగ్ చేస్తే ఫలితం పొందవచ్చు. ఈ టెక్నిక్తో బెస్ట్ బ్యాట్స్మెన్ను కూడా బోల్తా కొట్టించవచ్చు. ఈ యాంగిల్లో గూగ్లీలను వేసినప్పుడు, బ్యాట్స్మన్ ఊహించినంత బంతి టర్న్ కాలేని క్రమంలో వికెట్ సాధించవచ్చు.'అని ముస్తాక్ తెలిపాడు. పాక్ తరపున ముస్తాక్ 52 టెస్టులు, 144 వన్డేలు ఆడాడు.