
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రత్యర్థి బ్యాట్స్మన్ను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శ్రీలకంతో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్మన్ పరుగు తీయకుండా అడ్డురావాలని బౌలర్కు సూచిస్తూ ముష్పికర్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి.
అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటౌంది. ముష్ఫికర్ రహీర్(125) సెంచరీతో రాణించాడు. అనంతరం శ్రీలంక ఇన్నింగ్స్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఈ లక్ష్యచేధనలో శ్రీలంక బ్యాట్స్మన్ దనుష్క గుణ తిలక, పాతుమ్ నిస్సాంక కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.
ఇక మెహ్దీ హసన్ వేసిన 10వ ఓవర్లో ఐదో బంతిని గుణ తిలక డిఫెండ్ చేశాడు. బంతి కోసం మెహ్దీ హసన్ డైవ్ చేయగా.. నాన్స్ట్రైకర్ పాతుమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ ముష్ఫికర్ పరుగు తీయకుండా అడ్డురావాలని మెహ్దీ హసన్కు సూచించాడు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముష్ఫికర్ ఏందీ తొండాట అంటూ నిలదీస్తున్నారు. ఇక ప్రత్యర్థుల పట్ల ముష్ఫికర్ దూకుడుగా, దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను చాలా సార్లు క్రీడా స్పూర్తి విరుద్దంగా ప్రవర్తించాడు. శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయడంతో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో వన్డే మిగిలుండగానే 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.
ఈ భారీ విజయంతో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో బంగ్లాదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక 2023 వరల్డ్ కప్నకు అర్హత సాధించే క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా 8 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్... ఐదింటిలో గెలుపొంది 50 పాయింట్లతో టాప్లో కొనసాగుతోంది. కాగా ఆడిన 9 మ్యాచ్లలో నాలుగింటిలో గెలుపొందిన ఇంగ్లండ్ 40 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... రన్రేట్లో వెనుకబడిన పాకిస్తాన్ 40 పాయింట్లతో మూడో ప్లేస్లో ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే... 6 వన్డేల్లో 3 గెలిచి, 3 ఓడి.. 29 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.
బంగ్లాదేశ్కు తాజాగా సిరీస్ సమర్పించుకున్న శ్రీలంక.. ఇప్పటి వరకు ఆడిన ఐదింటిలోనూ ఓడిపోయి, బోణీ కొట్టలేక.. -2 పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్నకు అర్హత సాధిస్తాయి. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నందుకుగానూ టీమిండియాకు నేరుగా అర్హత లభిస్తుంది.