ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-బీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో గురువారం ప్రారంభమైన మ్యాచ్లో ముషీర్ ఖాన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-బీ 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఇండియా-ఏ పేసర్లు నిప్పులు చెరగగా.. ఇండియా బీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 30), అభిమన్యు ఈశ్వర్(42 బంతుల్లో 13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్(9), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(0), వాష్టింగన్ సుందర్(0), సాయి కిషోర్(1) దారుణంగా విఫలమయ్యారు.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టెయిలండర్ నవ్దీప్ సైనీ(74 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 28 బ్యాటింగ్) సాయంతో ముషీర్ ఖాన్ జట్టును ఆదుకున్నాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. ప్రస్తుతం 108 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఈ జోడీ క్రీజులో ఉంది.
పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో డిఫెన్స్కు పరిమితమైన ముషీర్ ఖాన్.. తన అసలు సిసలు క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ముందుగా 118 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. 205 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 10 ఫోర్లతో పాటు 2 సిక్స్లు బాదాడు. దాంతో ఇండియా బీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు.
సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబర్చిన ముషీర్ ఖాన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సూపర్ బ్యాటింగ్ అంటూ నెటిజన్లు ముషీర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్ ఖాన్.. దేశవాళీ క్రికెట్లో గతకొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ముంబై తరఫున రంజీ క్రికెట్లో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ సెంచరీల మోత మోగించాడు.
దులీప్ ట్రోఫీలో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ ఇండియా బీ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులే చేసి ఎల్బీగా వెనుదిరగ్గా.. తమ్ముడు ముషీర్ ఖాన్ మాత్రం శతకంతో అదరగొట్టాడు.