ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో భారత అప్కమింగ్ స్టార్, ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్(373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్లతో 181) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అరంగేట్ర దులీప్ ట్రోఫీ మ్యాచ్లోనే ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్ ఖాన్.. బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో గురువారం ప్రారంభమైన మ్యాచ్లో దుమ్మురేపాడు.
94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇండియా బీ జట్టును ముషీర్ ఖాన్.. టెయిలెండర్ నవ్దీప్ సైనీ(144 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 56)తో కలిసి ఆదుకున్నాడు. 8వ వికెట్కు 205 పరుగులు జోడించాడు. దాంతో ఇండియా-బీ తొలి ఇన్నింగ్స్లో 321 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆటలోనే శతకం పూర్తి చేసుకున్న ముషీర్ ఖాన్.. రెండో రోజు అదే తరహా బ్యాటింగ్తో చెలరేగాడు.

డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో 19 పరుగుల దూరంలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అయితే ఔటవ్వడానికి ముందు ముషీర్ ఖాన్ కొట్టిన సిక్సర్.. చిన్నస్వామి స్టేడియం పైకప్పును తాకింది.
ఆ షాట్తో మరింత ఉత్సాహానికి గురైన ముషీర్ ఖాన్.. మరో భారీ సిక్సర్కు ప్రయత్నించి రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం ముషీర్ ఖాన్ భారీ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సిక్సర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ ఏమో కానీ.. ముషీర్ ఖాన్ భారత క్రికెట్ను ఏలుతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఏ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(36), శుభ్మన్ గిల్(25) విఫలమైనా.. రియాన్ పరాగ్(27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(23 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్లు ఇద్దర్నీ నవ్దీప్ సైనీ పెవిలియన్ చేర్చాడు.