
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ మురళీ విజయ్ భారత క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఫారిన్ లీగ్స్ ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. గత కొంతకాలంగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మురళీ విజయ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. దాంతో భారత క్రికెట్కు వీడ్కోలు పలికి వీదేశీ లీగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. బీసీసీఐ (BCCI)తో తన బంధం ముగిసినట్లేనని.. అవకాశాల కోసం విదేశాల వైపు చూస్తున్నట్లు వెల్లడించాడు. భారత్లో 30 ఏళ్లు వస్తే ముసలోడిలా చూస్తున్నారని చమత్కరించాడు.
'బీసీసీఐతో దాదాపు నా బంధం ముగిసినట్లే. విదేశాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. మరికొంత కాలం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. భారతదేశంలో 30 ఏళ్లు దాటిన వారిపై వివక్ష చూపిస్తారు. వాళ్లు మమ్మల్ని వీధిలో నడుస్తున్న 80 ఏళ్ల వృద్ధులుగా చూస్తారు. అయితే. నేను ఎలాంటి వివాదాలు చేయాలనుకోవడం లేదు. మీడియా కూడా దీన్ని భిన్నంగా చూడాలి.
ప్రస్తుతం నేను సాధ్యమైనంత వరకు మంచి ఆటతీరును కనబరుస్తానని భావిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండడంతో బయట అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్తున్నాను. మన చేతిలో ఉన్నది మాత్రమే మనం చేయగలం. మన చేతిలో లేని వాటిని నియంత్రించలేం. తర్వాత ఏం జరగాల్సి ఉంటే అది జరుగుతుంది'అని మురళీ విజయ్ అన్నాడు.
ఇక 38 ఏళ్ల మురళీ విజయ్ భారత్ తరఫున చివరిసారిగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడాడు. టీమిండియా తరఫున ఇప్పటివరకు 61 టెస్టుల్లో 38.29 సగటుతో 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు ఆడిన మురళీ విజయ్.. 339 పరుగులు చేశాడు. 9 టీ20ల్లో 169 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో కూడా ఈ వెటరన్ బ్యాటర్ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దాంతో క్యాష్ రిచ్ లీగ్కు కూడా మురళీ విజయ్ దూరమయ్యాడు.