చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సెన్సేషన్ ఆయుష్ మాత్రే చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. మూడు ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్లో సెంచరీలు బాదిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సెంచరీ చేయడం ద్వారా ఆయుష్ మాత్రే ఈ ఫీట్ సాధించాడు.
ఈ టోర్నీలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయుష్ మాత్రే.. విదర్భతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆయుష్ మాత్రే అజేయ శతకంతో ఈ మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్లో సెంచరీలు బాదిన ఆయుష్ మాత్రే తాజాగా టీ20ల్లోనూ శతకాన్ని అందుకున్నాడు. దాంతో రోహిత్ పేరిట ఉన్న అరుదైన రికార్డ్ను అధిగమించాడు.

రోహిత్ శర్మ 19 ఏళ్ల 339 రోజుల వయసులో మూడు ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్లో సెంచరీలు బాదగా.. ఆయుష్ మాత్రే 18 ఏళ్ల 135 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. దేశవాళీ టీ20ల్లో ముంబై తరఫున రోహిత్ 2007లో సెంచరీ బాది ఈ ఫీట్ సాధించాడు. 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్ను తాజాగా ఆయుష్ మాత్రే అధిగమించాడు.
లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది. అథర్వ టైడ్(64), అమన్ మోఖడే(61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో సాయిరాజ్ పాటిల్, శివమ్ దూబే మూడేసి వికెట్లు తీయగా.. అథర్వ అంకోలేకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం ముంబై 17.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(35), శివమ్ దూబే(39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దర్శన్ నల్కండే, పార్థ్ రెఖడే, యష్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.