
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టులోకి మరో యువ స్పిన్నర్ను తీసుకుంది. జట్టులోని యువ లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో అతనికి రిప్లేస్మెంట్గా స్పిన్నర్ను ఎంచుకుంది. మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయను జట్టులోకి తీసుకొని అర్షద్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసింది.
ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్షద్ ఖాన్ను రూ. 20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా అతడికి ఆడే అవకాశం దక్కలేదు. అయితే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా అర్షద్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో కుమార్ కార్తికేయను రూ. 20 లక్షలకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక కార్తికేయ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్లో 35 వికెట్లు, లిస్ట్-ఎ కెరీర్లో 18 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు. అయితే ముంబై స్పిన్నర్ హృతిక్ షోకీన్ రాణిస్తుండటంతో.. కార్తికేయకి తుది జట్టులో చోటు దక్కించుకోడం కష్టమనే చెప్పుకోవాలి.
ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లకు 8 మ్యాచ్లు ఆ జట్టు ఓటమిపాలైంది. ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్లు రాణిస్తున్నా.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల బ్యాటింగ్ వైఫల్యం, బౌలర్ల పేలవ బౌలింగ్ జట్టు పరాజయాలకు కారణమైంది.