
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగియనుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన కేవలం ఐదింటిలోనే గెలుపొందింది. మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు.
ఎందుకంటే ఆ జట్టు రన్రేట్ మిగతా జట్ల కన్నా తక్కువగా ఉంది. మిగతా రెండు మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదు చేసి ఘన విజయాలు సాధిస్తేనే రన్రేట్ మెరుగవుతుంది. అయితే యూఏఈ పిచ్లపై భారీ స్కోర్లు నమోదు చేయడం అంత సులువు కాదు. దాంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకున్నట్లే.
ప్రస్తుతం 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న ముంబై.. -0.453 రన్ రేట్తో ఉంది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఆర్సీబీ రన్ రేట్ ముంబై కన్నా మెరుగ్గా ఉంది. ఈ పరిస్థితుల్లో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి. మిగతా జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి.. ముంబై భారీ తేడాతో గెలుపొందిదే తప్పా టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు.
2019, 2020 రెండు సీజన్లలో వరుసగా టైటిల్ గెలుచుకున్న రోహిత్ సేన.. హ్యాట్రిక్ టైటిల్పై కన్నేసింది. కానీ భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్లో విఫలమైన ఆ జట్టు కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఇక యూఏఈ వేదికగా జరుగుతున్న సెకండాఫ్లో ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన రోహిత్ సేన.. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో మాత్రం గెలుపొందింది. దాంతో మళ్లీ ముంబై తమకు అలవాటైన మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? అని అంతా భావించారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తాజా మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో ఆ జట్టు ఓటమిపాలైంది. తదుపరి మ్యాచ్ల్లో ముంబై.. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచినా.. ముంబై ప్లే ఆఫ్స్ చేరడం కష్టం.
తాజా మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 33 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(21 బంతుల్లో సిక్స్తో 20 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్నందించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్ తలో వికెట్ తీసారు.