ఐపీఎల్ 2025 సీజన్ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. తమకు అలవాటైన రీతిలోనే ముంబై తొలి మ్యాచ్ను దేవుడికిచ్చేసింది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు తొలి విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. దాంతో ఈ పోరు రసవత్తరంగా ఉండనుంది.

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..
స్లో ఓవర్ రేట్ నిషేధం కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో ఆ ఫ్రాంచైజీని నడిపించిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఆ జట్టుకే వ్యతిరేకంగా ఆడనున్నాడు. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుకు అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం అతను వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో ముంబై ఇండియన్స్ తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ రాకతో ముంబై బౌలింగ్ ఆప్షన్స్ కూడా పెరగనున్నాయి.
విల్ జాక్స్పై వేటు..
ఈ క్రమంలోనే హార్దిక్ కోసం.. విల్ జాక్స్పై వేటు వేసే అవకాశం ఉంది. అతని స్థానంలో ఎక్స్ట్రా ఓవర్సీస్ పేసర్ను జట్టులోకి తీసుకోవచ్చు. రీస్ టోప్లీని ఆడించవచ్చు. అదే జరిగితే తెలుగు కుర్రాడు సత్య నారయణ రాజు బెంచ్కుపరిమితమవుతాడు. గత మ్యాచ్తోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన సత్యనారయణ రాజు.. ఒకే ఒక్క ఓవర్ వేసాడు. అతన్ని తప్పిస్తే మూడో స్పిన్నర్గా కర్ణ్ శర్మను కూడా ఆడించే అవకాశం ముంబై ఇండియన్స్కు దక్కుతుంది. మిచెల్ సాంట్నర్, యువ సంచలన విజ్ఞేష్ పుతుర్తో కలిసి అతను స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, విజ్ఞేష్ పుతుర్.