
రోహిత్ శర్మ రెడీ..
మొకాలి గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్కు దూరమైన రోహిత్ శర్మ కోల్కతా మ్యాచ్కు రెడీ అయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ అతను పూర్తిగా కోలుకున్నప్పటికి ముందస్తు చర్యల్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ ఆడించలేదని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తెలిపింది. దాంతో కీరన్ పొలార్డ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించాడు.
రోహిత్ గైర్హాజరీ టీమ్ ఫలితంపై ప్రభావం చూపించింది. కెప్టెన్ పొలార్డ్ చేసిన తప్పిదాలు జట్టు ఓటమిని శాసించాయి. పూర్తి ఫిట్గా రోహిత్ శర్మ కోల్కతాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడని ఆ జట్టు కోచ్ జయవర్దనే తెలిపాడు. హిట్ మ్యాన్ తుది జట్టులో చేరితే అటు బ్యాటింగ్.. ఇటు కెప్టెన్సీ పరంగా టీమ్ బలం పెరగనుంది. ఫస్ట్ మ్యాచ్లో విఫలమైన డికాక్తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. రోహిత్ జట్టులోకి వస్తే అన్మోల్ ప్రీత్ సింగ్ బెంచ్కు పరిమితం కానున్నాడు.

హార్దిక్ పాండ్యా డౌట్..
ఎన్నో అంచనాలు మధ్య బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లో ఫస్ట్ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. వీరి వైఫల్యం టీమ్ విజయంపై ప్రభావం చూపించింది. ఈ వైఫల్యంతో తుది జట్టులో వారి స్థానాలకు వచ్చే డోకా ఏం లేదు కానీ.. ఈ ఇద్దరు ఫామ్లోకి రావాల్సిందే. లేకుంటే ముంబైకి కష్టాలు తప్పవు.
ఇక ఫస్ట్ మ్యాచ్కు దూరమైన హార్దిక్ పాండ్యా కూడా పూర్తిగా కోలుకున్నాడని, టీమ్ సెలెక్షన్కు అందుబాటులోకి వచ్చాడని జయవర్ధనే తెలిపాడు. అయితే హార్దిక్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. హార్దిక్ జట్టులోకి వస్తే సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యాల్లో ఒకరు ఉద్వాసనకు గురవుతారు. ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన సౌరభ్ తివారిని పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చు. దారుణంగా విఫలమైన కృనాల్ పాండ్యాపైనే వేటు పడవచ్చు. అవసరమైతే ఇషాన్ కిషన్ను తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పొలార్డ్ చెలరేగాలి..
సౌరభ్ తివారి జట్టు ఉంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత పొలార్డ్ బరిలోకి దిగనుండగా.. ఏడో స్థానంలో హార్దిక్ ఆడుతాడు. ఇక ఫస్ట్ మ్యాచ్లో గెలిపిస్తాడనుకున్న పొలార్డ్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లోనైనా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలి. హార్దిక్ జట్టులోకి వస్తేమాత్రం తనను తాను నిరూపించుకోవాలి.
గత కొంతకాలంగా అతను నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. అటు బౌలింగ్ కూడా చేయడం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతను ఫామ్లోకి రావడం భారత జట్టకు చాలా ముఖ్యం. గతేడాది కూడా హార్దిక్ పెద్దగా రాణించలేదు. పేలవ ఫామ్ కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు గల్లంతవుతుంది.

బుమ్రా, బౌల్ట్..
ఏకైక స్పిన్నర్గా రాహుల్ చాహర్ జట్టులో ఉండనున్నాడు. అబుదాబి వేదికగా మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే కృనాల్ పాండ్యాను జట్టులోకి తీసుకుంటారు. అప్పుడు సౌరబ్ తివారీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఇక బుమ్రాతో ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఫస్ట్ మ్యాచ్లో ఈ ముగ్గురు పేసర్లు దుమ్మురేపారు. కానీ చివర్లోనే చాలా దారుళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ ముగ్గురు మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగలిగితే ఆడమ్ మిల్నే ప్లేస్లో మరో స్పిన్ ఆల్రౌండర్ జయంత్ యాదవ్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ పియూష్ చావ్లాను తీసుకోవచ్చు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారి, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ మిల్నే


Click it and Unblock the Notifications
