ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్, అఫ్గానిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో మహమ్మద్ నబీ దుమ్మురేపాడు. ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్గా చరిత్రకెక్కాడు. 39 ఏళ్ల ఒక నెల వయసులో మహమ్మద్ నబీ ఈ ఫీట్ సాధించాడు.
తద్వారా శ్రీలంక దిగ్గజ ప్లేయర్ తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉన్న ఈ రికార్డును అతను అధిగమించాడు. 2015 జూన్లో దిల్షాన్ 38 ఏళ్ల 8 నెలల వయసులో నెంబర్ వన్ వన్డే ఆల్రౌండర్గా నిలిచాడు. శ్రీలంకతో పల్లెకెలె వేదికగా జరిగిన తొలి వన్డేలో మహమ్మద్ నబీ శతకంతో చెలరేగాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్తో 314 రేటింగ్ పాయింట్స్ను ఖాతాలో వేసుకొని నబీ నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(310)ను వెనక్కినెట్టాడు. దాదాపు గత ఐదేళ్లుగా వన్డే ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగిన షకీబ్ అల్ హసన్ను నబీ అధిగమించాడు. షకీబ్ దాదాపు 1739 రోజు నెంబర్ వన్ వన్డే ఆల్రౌండర్గా కొనసాగాడు. 2019 మే 7 నుంచి నబీ అధిగమించే వరకు షకీబ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ ఇద్దరి తర్వాత సికిందర్ రాజా(జింబాబ్వే), రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్), అసద్ వలా(పపువా న్యూ గేనియా) ఆటగాళ్లు టాప్-5లో కొనసాగుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 209 రేటింగ్ పాయింట్స్తో అతను 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్, ఆర్సీబీ సెన్సేషన్ గ్లేన్ మ్యాక్స్వెల్ ఆరో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో మహమ్మద్ నబీని ముంబై ఇండియన్స్ రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. అప్కమింగ్ సీజన్లో మహమ్మద్ నబీ ముంబై స్పిన్నర్గా కీలక పాత్ర పోషించనున్నాడు.