ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సారథిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్ఫాలో చేశారు. ఎక్స్వేదికగా ముంబై ఇండియన్స్ ట్విటర్ హ్యాండిల్ను 4 లక్షల మంది అన్ఫాలో చేశారు.
అలాగే #ShameOnMI హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ నూతన సారథి ప్రకటన వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఈ యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోనే కొనసాగుతుండటం గమనార్హం. ముంబై ఇండియన్స్ కోసం రోహిత్ శర్మ ఎంతో చేశాడని, కానీ ఆ జట్టు యాజమాన్యం అతన్ని దారుణంగా అవమానించిందని మండిపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్ల సంఖ్య తగ్గిన స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ను మళ్లీ చూడలేమని, ఇకపై ముంబై ఇండియన్స్కు మద్దతు ఇవ్వబోమని భావోద్వేగపూరిత పోస్ట్లు పెడుతున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినా రోహిత్ శర్మ మౌనంగా ఉండటం ఏంటో తమకు అర్థం కావడం లేదంటున్నారు.
ఇతర ఫ్రాంచైజీలు సైతం రోహిత్ శర్మ అసాధారణ కెప్టెన్ అని, ఓ శకం ముగిసిందని పోస్ట్లు చేస్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్లో రోహిత్ శర్మ ఓ ప్లేయర్గా మాత్రమే కనిపించనున్నాడు.
అనూహ్యంగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. జట్టుకు తొలి టైటిల్ అందించడంతో పాటు మొత్తం ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2013లో తొలి 6 మ్యాచ్ల్లో ముంబైకి సారథిగా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏడో మ్యాచ్ నుంచి రోహిత్ జట్టును నడిపించాడు. అదే సీజన్లో ముంబైకి తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017,2019,2020 సీజన్లలో ముంబైని ఛాంపియన్గా నిలబెట్టాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 158 మ్యాచ్ల్లో 87 విజయాలతో పాటు 67 పరాజయాలు నమోదు చేసింది. 4 మ్యాచ్లు ఫలితం తేలలేదు. 2021, 2022లో ముంబై దారుణంగా విఫలం కాగా.. ఐపీఎల్ 2023 సీజన్లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది.