
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు వెలుతురు కారణంగా స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబై స్కోరు 79/4 పరుగుల వద్ద కృనాల్ పాండ్యా-కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో మైదానంలోని ఫ్లడ్లైట్లలో సమస్య వచ్చింది. లైట్లు వెలుగుతూ, ఆరిపోవడంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
దీంతో అంపైర్లు ఆటను కాసేపు తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన స్టేడియం సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో అంపైర్లు ఆతర్వాత ఆటను యథావిధిగా కొనసాగించారు. ఒకానొక సమయంలో రెండు ఫ్లడ్లైట్లు ఆగిపోవడంతో మైదానం చీకటిగా మారిపోయింది.
దీంతో వాంఖడె స్టేడియంలో లైట్లు వెలుగుతూ, ఆరిపోతూ ఉన్న వీడియోలను క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెట్లు పెట్టారు. 'మ్యాచ్ మధ్యలో లైట్లు ఆగిపోయాయి. వాంఖడే మైదానంలో ఈ సమస్య తరుచూ ఎదరవుతూనే ఉంది' అని ఓ నెటిజన్ కామెంట్ పోస్టు చేశాడు.
మరో నెటిజన్ 'వాంఖడె మైదానం సిబ్బంది కరెంటు బిల్లు కట్టలేదేమో అందుకే కనెక్షన్ తీసేసి ఉంటారు' అంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకున్న సంగతి తెలిసిందే.