
న్యూఢిల్లీ: మరో 13 రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా సిద్దమవుతోంది. ఇప్పటికే దుబాయ్లో ప్రాక్టీస్ షురూ చేసిన ఆ జట్టు.. ఆటగాళ్లకు విలాసవంతమైన ఏర్పాట్లను చేసింది. మరే ఇతర జట్టుకు లేని సౌకర్యాలను కల్పిస్తుంది. అయితే చెన్నై సూపర్ సింగ్స్ జట్టులో 13 మందికి కరోనా సోకిన నేపథ్యంలో ముంబై సరికొత్త ఆలోచన చేసింది.
కరోనా కట్టడికి నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) శైలిలో ఓ స్మార్ట్ రింగ్ను ప్రవేశపెట్టింది. ఇది వ్యక్తిగత హెల్త్ ట్రాకింగ్ డివైస్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని పెట్టుకోవాలి. ఇప్పటికే బీసీసీఐ.. బ్లూటూత్తో కూడి కాంటాక్ట్ డివైస్ను అన్ని జట్లకు ఇచ్చింది. హెల్త్ యాప్ ద్వారా ఇందులో ప్రతి ఒక్కరు డైలీ ఫిట్నెస్ వివరాలను పొందుపర్చాలి. అయితే దీని అడ్వాన్స్ మోడల్గా ఇప్పుడు ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లకు స్మార్ట్ రింగ్ను అందజేయనంది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ స్మార్ట్ రింగ్ అలర్ట్ చేస్తుంది.
'వ్యక్తుల హార్ట్ రేట్, హార్ట్ రేట్ వ్యత్యాసాలు, శ్వాసకోశ రేట్, శరీర ఉష్ణోగ్రతలతో ఇతర వివరాలను ఈ రింగ్ గుర్తిస్తుంది. ఇందులో ఏదైనా తేడా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఎన్బీఏ ఇలాంటి రింగ్ హెల్త్ పరికరాన్ని ఉపయోగించింది'అని ముంబై ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపారు. మ్యాచ్ల పరంగా ఎంత ఇంటెన్సిటిని చూపించే ముంబై.. హై స్టాండర్డ్ ఆపరేషన్ ఎక్స్లెన్స్తో టీమ్లో క్లబ్ స్పోర్ట్స్ కల్చరన్ అంతకు మించి డెవలప్ చేసింది. పీపీఈ కిట్లతో ఆటగాళ్లను దుబాయ్కి తరలించింది. విలాసవంతమైన గదులు, రిక్రేయషనల్ గేమింగ్ జోన్, 10 వేల స్క్వేర్ ఫీట్లతో జిమ్నాజియంను ఏర్పాటు చేసింది.
ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు షార్జా, దుబాయ్, అబుదాబి మూడు వేదికల్లో ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. మరికొద్దిగంటల్లో షెడ్యూల్ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.