వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్నందుకుంది. 166 పరుగుల లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే చేధించి చరిత్ర సృష్టించింది.
ఈ భారీ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్కు సన్రైజర్స్ హైదరాబాద్ అడుగు దూరంలో నిలిచింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. సన్రైజర్స్ గెలుపుతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.

ప్రస్తుతం టాప్-6లో ఉన్న జట్లే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ టాప్-3లో కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 6 విజయాలతో తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ చివరి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్రైజర్స్ విజయంతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 4 విజయాలు మాత్రమే నమోదు చేసింది. చివరి రెండు మ్యాచ్లు గెలిచినా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48) దూకుడుగా ఆడారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.