ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబైని వీడి కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టులో చేరేందుకు రోహిత్ సిద్దమయ్యాడని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కేకేఆర్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం అందుకున్న రోహిత్ శర్మను అభినందిస్తూ కేకేఆర్ ఓ పోస్ట్ చేసింది. 'వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్. కంగ్రాట్స్ రోహిత్. ఇందుకు మీరు పూర్తి అర్హులు'అని ఆ పోస్ట్లో పేర్కొంది. ఈ పోస్ట్కు ఓ అభిమాని 'అయితే కన్ఫామ్ అనుకోవచ్చా..?' అని కామెంట్ చేయగా కేకేఆర్ స్పందించింది. 'నంబర్ 1 వన్డే బ్యాటర్ కన్ఫామ్' అంటూ బదులిచ్చింది. ఆ వ్యక్తి వెంటనే 'అంటే హిట్మ్యాన్ కేకేఆర్లో చేరినట్టే..' అని బదులివ్వడంతో ఈ సంభాషణ క్షణాల్లోనే వైరల్ అయింది.

రోహిత్ శర్మ క్లోజ్ ఫ్రెండ్ అయిన అభిషేక్ నాయర్.. కేకేఆర్ హెడ్ కోచ్గా ఎంపికవ్వడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అభిషేక్ నాయర్ మార్గదర్శకంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతని పర్యవేక్షణలోనే కఠినమైన డైట్, వ్యాయామాలతో 10 కిలోల బరువు తగ్గాడు. దాంతో అభిషేక్ నాయర్ సూచనలతో రోహిత్ కేకేఆర్లోకి వెళ్తాడనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఈ వార్తల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ స్పందించింది. రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లడని, ముంబై జట్టులోనే ఉంటాడని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్లో ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా కోడ్ లాంగ్వేజ్తో తమ సందేశాన్ని అభిమానులకు తెలియజేసింది.
'సూర్యుడు మళ్లీ రేపు ఉదయిస్తాడు. కానీ రాత్రిపూట ఉదయించడం అసాధ్యం!' అనే క్యాప్షన్తో రోహిత్ శర్మతో ఉన్న ఫొటోను పంచుకుంది. అయితే ఇక్కడ నైట్ అనే పదం దగ్గర కే అనే అక్షరాన్ని బ్రాకెట్లో ఉంచింది. రోహిత్ సూర్యుడని, నైట్రైడర్స్కు వెళ్లడని పరోక్షంగా చెప్పింది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సంగతి విదితమే. ఈ ప్రదర్శనతోనే రోహిత్ తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు.