IPL 2020: ముంబై, కోల్కతాలకు షాక్.. మరో వారం రోజులు క్వారంటైన్లోనే!!

అబుదాబి: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈవారంలో అధికారిక షెడ్యూల్ రానుంది. ఐపీఎల్ ప్రారంభం కావడానికి 20 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్ ముగించుకుంటున్నాయి. కొన్ని జట్లు దుబాయ్లో, మరికొన్ని జట్లు అబుదాబిలో ఉన్నాయి.

మరో వారం క్వారంటైన్లోనే:
ఐపీఎల్ 2020 కోసం బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులు ఇప్పటికే మూడు వేదికలు దుబాయ్, అబుదాబి, షార్జాలను సిద్ధం చేశాయి. టోర్నీ కోసం దుబాయ్లో దిగిన జట్లు ఆరు రోజుల క్వారంటైన్ గడువును కూడా పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం మరో వారం రోజులు క్వారంటైన్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఈ రెండు జట్లు అబుదాబికి వెళ్లాయి కాబట్టి. అక్కడ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్థానిక అధికారులు 14 రోజుల క్వారంటైన్ నిబంధల్ని పక్కాగా అమలు చేస్తున్నారు.

ప్రాక్టీస్ ఆలస్యం:
దుబాయ్కి వెళ్లిన జట్లు ఆరు రోజుల పాటు హోటల్ గదుల నుంచి బయటకు రాకుండా ఉంటే.. కరోనా టెస్టుల అనంతరం ఏడో రోజు నుంచి ఔట్ డోర్లో ప్రాక్టీస్ చేసుకునే వీలుంది. దీంతో అన్నింటికన్నా ముందు వెళ్లిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈరోజు నుంచి సాధన మొదలుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ కూడా శుక్రవారం నుండి ప్రాక్టీస్ చేస్తాయి. టోర్నీ కోసం చివరలో వెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మరో రెండు రోజుల్లో క్వారంటైన్ గడువును పూర్తి చేసుకోనున్నాయి. ఆ తర్వాత ఇవి కూడా ప్రాక్టీస్ మొదలుపెడతాయి. ఇక ముంబై, కోల్కతా అబుదాబిలో ఉంటున్న నేపథ్యంలో ఆ జట్ల ప్రాక్టీస్ ఆలస్యమవుతుంది.

ముంబై వినతి:
క్వారంటైన్ విషయంపై చొరవ తీసుకొని స్థానిక అధికారులను సంప్రదించాలని ముంబై ఇండియన్స్ సిబ్బంది బీసీసీఐని కోరారు. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ సైతం ఎమిరేట్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక యూఏఈలో రెండు ప్రధాన నగరాల మధ్య ఇలాంటి కఠిన నిబంధనలు నెలకొన్న పరిస్థితుల్లో ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించడం కూడా సవాలుగా మారింది. దీంతో లీగ్ను రెండు దశల్లో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఫైనల్స్ కోసం దుబాయ్కు?:
రెండు దశలలో ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచులను పూర్తిచేయాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా దుబాయ్, ఆ తర్వాత అబుదాబిలో మ్యాచులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్లే-ఆఫ్స్, ఫైనల్స్ కోసం జట్లు మళ్లీ దుబాయ్కు తిరిగిరానున్నాయి. దుబాయ్లో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ వారంలో అధికారిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
నిన్ను చూడగానే.. నా కష్టాలన్నీ మరిచిపోతా: రైనా