
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సన్మానించనుంది. ఇటీవలే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా ఎంపికైనందుకు ఎంసీఏ అతన్ని ఘనంగా సత్కరించాలనుకుంటుంది. ప్రస్తుతం టీ20, వన్డేల్లో టీమిండియాను నడిపిస్తున్న రోహిత్ శర్మ.. శ్రీలంకతో జరిగే అప్కమింగ్ టెస్టు సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఎంసీఏ, రోహిత్ను సన్మానించాలని నిర్ణయించినట్లు ఎంసీఏ సభ్యుడు వెల్లడించారు.
రోహిత్ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లను కూడా ఎంసీఏ సన్మానించనుంది. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టు తరపున మెరుగైన ప్రదర్శన చేసిన యువ ఆటగాడు రఘువంశీకి మొమెంటోతో పాటు రూ.లక్ష రివార్డు అందిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా టీమిండియాలో తమ ప్రదర్శనతో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకుర్, శ్రేయస్ అయ్యర్లను కూడా ఎంసీఏ సన్మానించనుంది. వీరితో పాటు యువక్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాలు కూడా ఈ సన్మానం అందుకోనున్నారు. ఐపీఎల్ ప్రారంభమయ్యేలోపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంసీఏ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.
ఇక రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన.. వెస్టిండీస్తో వన్డే సిరీస్, టీ20 సిరీస్లను క్వీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో గురువారం జరగిన టీ20 మ్యాచ్లోనూ 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీ20ల్లో టీమిండియా వరుసగా 10 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదివరకు 2020లో భారత్ వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది. ఇప్పుడా రికార్డును రోహిత్ సేన బద్దలుకొట్టింది. మరోవైపు ఈ ఓటమితో శ్రీలంక పొట్టి ఫార్మాట్లో అత్యధిక వైఫల్యాలు చవిచూసిన జట్లలో వెస్టిండీస్తో సమానంగా 83 ఓటములతో నిలిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 78, న్యూజిలాండ్ 76 ఓటములతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.