టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభానికి ముందే ఈ పోస్ట్ పెట్టడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని తన ఇన్స్టా స్టోరీలో ముఖేష్ కుమార్ హెచ్చరించాడు.
'కర్మ సమయం కోసం వేచి చూస్తుంది. మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కర్మ క్షమించదు, అది ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది.'అని ముఖేష్ కుమార్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్.. సాధారణంగా పెట్టాడా? ఎవరినైనా ఉద్దేశించి పెట్టాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులను ఉద్దేశించా? లేక కెరీర్కు సంబంధించిందా? అనేది కూడా తెలియడం లేదు. కానీ నెటిజన్లు మాత్రం గంభీర్ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాడని అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోకి కొత్తగా హర్షిత్ రాణాను తీసుకోవడంతోనే ముఖేష్ కుమార్ ఈ పోస్ట్ పెట్టాడని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టులో ముఖేష్ కుమార్ మెరుగైన ప్రదర్శన చేశాడు. బౌలర్లందరిలో అతనే ఎక్కువ వికెట్లు తీసాడు. 92 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రెండో అనధికారిక టెస్ట్లో అతనికి అవకాశం దక్కలేదు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు కూడా ముఖేష్ కుమార్ ఎంపికవ్వలేదు.
అయితే భారత్-ఏ జట్టులో భాగంగా ఉన్న హర్షిత్ రాణాను ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్ట్లు ఆడలేని పరిస్థితి నెలకొనడంతో అతనికి బ్యాకప్గా తీసుకున్నారు. అయితే భారత్-ఏ తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన తనను కాకుండా హర్షిత్ రాణాను తీసుకోవడంపై ముఖేష్ కుమార్ ఆగ్రహానికి గురైనట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే అతను గంభీర్ను ఉద్దేశించి కర్మ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.