టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వివాహం చేసుకున్నాడు. బీహార్కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గోరఖ్పూర్లోని ఓ హోటల్లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ముఖేష్ కుమార్ పెళ్లిక సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ పెళ్లి కోసమే ముఖేష్ కుమార్ ఉన్నపళంగా టీమిండియాను వదిలి వెళ్లాడు. దాంతో ఆస్ట్రేలియా మంగళవారం గువహతి వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్కు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ముఖేష్ కుమార్ లేకపోవడంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకుంది. ఈ మ్యాచ్లో ముఖేష్ కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. కచ్చితమైన యార్కర్లతో ముఖేశ్ టీమిండియా గెలిచి తొలి రెండు మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించాడు.
శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కి అతను అందుబాటులోకి రానున్నాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్ర చేసిన ముఖేష్ కుమార్.. సంచలన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్లలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు అతను ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
డిసెంబర్ 4న గోరఖ్పూర్లో ముఖేష్ కుమార్ వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు భారత ప్రధాన ఆటగాళ్లంతా హాజరయ్యే అవకాశం ఉంది.