బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం అన్నాడు. బ్యాటింగ్లో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే కనీస పోటీనిచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా బుధవారం భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో యూఏఈ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత వెరటన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 93 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ముహమ్మద్ వసీం.. వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయిన భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. 'మా బ్యాటింగ్ను బాగానే ప్రారంభించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మా ఓటమిని శాసించింది. భారత్ అద్భుతమైన జట్టు. అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రతీ బ్యాటర్కు తగ్గట్లు వ్యూహాలతో వచ్చారు. అందుకే భారత్ నెంబర్ వన్ జట్టుగా ఉంది. ఒక జట్టుగా మేం మరింత బలంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం. మా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.'అని ముహమ్మద్ వసీం చెప్పుకొచ్చాడు.