ఫోర్తో మొదలు
లక్ష్య ఛేదనలో 2 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్ 2 వికెట్లకు 6 పరుగులు. ఐపీఎల్ మిస్టర్ పర్ఫెక్ట్ సురేష్ రైనా లేడు. ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్ మ్యాచులు ఆడి ఏడాదికి పైగా గడిచింది. ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నా.. ఒక్కడు భారీ టార్గెట్ బాదగలడా అనే అనుమానం అందరిలో నెలకొంది. ఈ సమయంలో అంబటి రాయుడు బ్యాటింగ్కు వచ్చాడు. ప్యాటిన్సన్ బౌలింగ్లో బ్యాక్ఫుట్పై కొట్టిన ఫోర్తో రాయుడు జోరు మొదలైంది. బౌల్ట్ ఓవర్లో కొట్టిన కవర్ డ్రైవ్ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. ముంబై బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు.
33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
ఇక జస్ప్రీత్ బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ (ఫ్రీ హిట్) కొట్టిన అంబటి రాయుడు జోరు పెంచాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్లో మరో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం రాయుడు... బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హాఫ్ చేసిన పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి షాట్లతో అలరించిన రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. చెన్నైకి గెలుపు బాట చూపించి రాహుల్ చహర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మొత్తంగా రైనా లేని లోటు తెలియకుండా.. దూకుడుగా ఆడుతూ చెన్నైపై ఒత్తిడి తగ్గించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
ఎమ్మెస్కేను టార్గెట్ చేసిన ఫాన్స్
2019 ప్రపంచకప్లో ఆడే అవకాశం అంబటి రాయుడు వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్రౌండర్ (3డీ) అనే కారణంతో విజయ్ శంకర్కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన తెలుగు తేజం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే రాయుడుకి ప్రపంచకప్లో చోటు దక్కించుకోకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ తొలి మ్యాచ్లో రాయుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో మరోసారి ఎమ్మెస్కేను ఫాన్స్ టార్గెట్ చేశారు.
3డి గ్లాసులతో రాయుడుని చూడండి:
'ఎమ్మెస్కే ప్రసాద్.. 3డి గ్లాసులతో అంబటి రాయుడుని చూడండి' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. '2019 ప్రపంచకప్లో ఎందుకు రాయుడికి చోటివ్వలేదో కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానం చెప్పాలి' అని మరో అభిమాని ప్రశ్నించాడు. '2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో మనం ఇదే మిస్ అయ్యాం. ఎవరైనా ఔట్ అయినప్పుడు కోహ్లీ ఉంటాడు, కోహ్లీ పెవిలియన్ చేరినప్పుడు మన రాయుడు ఉండాలి. బాగా ఆడాడు. ఈ రోజు అతన్ని చూడటం ఆనందంగా ఉంది' అని టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. 'ప్రపంచకప్లో ఎంపిక చేయని సెలెక్టర్లకు ఇదో చెంపపెట్టు' అని మరొకరు ట్వీటారు.
నేను అది అస్సలు ఊహించలేదు.. ధోనీ నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయా: సామ్