హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 అనగానే ప్రతీ ఒక్కడు సెలెక్టర్ అయిపోతాడని, క్రికెట్ గురించి అక్షర జ్ఞానం తెలియని వాడు కూడా జట్టు ఎంపిక గురించి మాట్లాడుతాడని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్లో మాట్లాడిన ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేశాడు.
బయటి వ్యక్తులు జట్టు ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించాడు. జట్టు గురించి ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. ప్రపంచకప్ కోసం గతేడాదిగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్ల కన్నా బయటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లంతా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే జట్టును ప్రకటిస్తారని, ఎవరి వ్యక్తిగతా ఏజెండాలను పనిచేయవని స్పష్టం చేశాడు.

2019 వన్డే ప్రపంచకప్కు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీనే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని, ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపిక చేశారు. అప్పట్లో ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపింది. ప్రెస్మీట్లో త్రీడైమన్షన్ ఆటగాడంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం.. త్రీడీ కళ్లద్దాలతో అతని ఆటను చూస్తానని రాయుడు ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఇప్పటికీ ఈ వ్యవహారం ఎమ్మెస్కేను వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే టీమ్ ఎంపిక గురించి మాట్లాడేవారిపై కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే ప్రపంచకప్ జట్టులో అశ్విన్ను తీసుకుంటే జట్టుకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కానీ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ.. ఆసియాకప్ జట్టునే కొనసాగించింది.
జట్టులో అదనంగా ఉన్న తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణలను పక్కనపెట్టింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగార్కర్ మంగళవారం వెల్లడించాడు.
భారత ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.