
రోహిత్ వచ్చేశాడు
సుదీర్ఘ ఫార్మాట్లో గొప్ప రికార్డులేమి లేని రోహిత్ శర్మ గతేడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్లో ఓపెనర్ అవతారమెత్తాడు. వరుస శతకాలు సాధించి అన్ని ఫార్మాట్లలో సత్తాచాటగలనని నిరూపించాడు. అయితే రోహిత్ అసలు పరీక్షను ఎదుర్కోలేదు. గాయంతో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్లో గాయంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లోని రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఫిట్నెస్ను నిరూపించుకుని జట్టులోకి వచ్చాడు. దీంతో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారిలో ఒకరిపై వేటుపడనుంది. ఇద్దరిని పక్కనబెట్టి కేఎల్ రాహుల్కు కూడా అవకాశం ఇవ్వాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు.

ఒకరిపై వేటు తప్పదు
రోహిత్ శర్మ రాకపై పీటీఐ వార్తా సంస్థతో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడాడు. 'రోహిత్ శర్మ జట్టులోకి వస్తే మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలో ఒకరు తుది ట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. అయితే మయాంక్ ఎంతో ప్రతిభావంతుడు. గత 18 నెలల్లో అతడు సెంచరీ, డబుల్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. కాబట్టి అతడిని పక్కనబెట్టడం చాలా కష్టం. విహారి కూడా విదేశాల్లో బాగానే ఆడుతున్నాడు. అయితే రోహిత్ ఏ స్థానంలో ఆడుతాడనే క్లారిటీ లేదు' అని అన్నాడు.

హిట్మ్యాన్ ఏ స్థానంలో ఆడతాడు
'క్వారంటైన్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగడని అనుకుంటున్నా. ఓపెనింగ్ చేస్తాడా? లేదా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడా? అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. హిట్మ్యాన్ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ నుంచి జట్టు యాజమాన్యం ఎలాంటి పాత్రను ఆశిస్తోందనేది కూడా ఒక ప్రధాన అంశం' అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. సిడ్నీలోని ఓ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 14 రోజులు క్వారంటైన్లో ఉన్న రోహిత్.. ఎలాంటి జిమ్, ప్రాక్టీస్ సౌకర్యం లేకపోవడంతో చిన్న చిన్న వ్యాయామాలతో సరిపెట్టాడు. అతడికి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేకపోయింది.

రోహిత్, రాహుల్లను తీసుకోండి
మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇద్దరినీ బెంచ్కు పరిమితం చేసి.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ సెలక్టర్ దిలీప్ వెంగసర్కార్ సూచించాడు. సూపర్ఫామ్లో ఉన్న రాహుల్ తొలి రెండు టెస్టులకు ఎంపిక కాని విషయం తెలిసిందే. ఓపెనర్గా రోహిత్ వస్తే మయాంక్ బెంచ్కే పరిమితమవుతాడు. అరంగేట్రంలోనే శుభ్మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో అతడి స్థానం ఖరారైనట్లే. ఒకవేళ అయిదో స్థానంలో రోహిత్తో ఆడించాలనకుంటే విహారికి నిరాశ తప్పదు. ఈ క్రమంలో టీమ్మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. విహారీ, మయాంక్లపై వేటు వేసి రోహిత్, రాహుల్లను తీసుకుంటుందా? లేక విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తుందా? అనేది చూడాలి.


Click it and Unblock the Notifications

అద్భుతంగా ఆడాడు.. భారత ఓపెనర్పై కమిన్స్ ప్రశంసలు!!










