స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతని చేరికతో టీమిండియా బలం రెట్టింపు అయ్యిందన్నాడు. తొడ కండరాల గాయంతో వైజాగ్ టెస్ట్కు దూరమైన రవీంద్ర జడేజా పూర్తిగా కోలుకొని గురువారం నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్ బరిలోకి దిగనున్నాడు.
రాజ్కోట్ రవీంద్ర జడేజాకు హోమ్ గ్రౌండ్ కాగా.. అతని రాకతో టీమిండియా స్పిన్ విభాగంతో పాటు బ్యాటింగ్ యూనిట్ పటిష్టంగా మారనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం Mykhel ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్లో స్పిన్ విభాగంలో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనబడింది. జడేజా రాకతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా మారనుంది. మూడు విభాగాల్లో సత్తా చాటే రవీంద్ర జడేజా రీఎంట్రీ జట్టును మరింత బలంగా మారుస్తోంది. అతని రీఎంట్రీ ఈ సిరీస్లో టీమిండియాకు శుభ సూచకం.
హైదరాబాద్ టెస్ట్ పరాజయం అనంతరం భారత్ అద్భుతంగా పుంజుకొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టును సరైన దిశలో ముందుకు తీసుకెళ్తున్నాడు. కుర్రాళ్లు అయిన ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లు అరంగేట్రం చేయనుండటం గొప్ప విషయం. వరల్డ్ బెస్ట్ టీమ్పై అరంగేట్రం చేసి
మెరుగైన ప్రదర్శనతో పరుగులు చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. జీవితంలో మరిచిపోలేని మ్యాచ్గా నిలిచిపోవడంతో పాటు అభిమానుల ప్రేమ దక్కుతుంది.
యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ తన ఫామ్ను కొనసాగించాలి. అతను అద్భుతమైన ఆటగాడు. అన్ని రకాల పరిస్థితుల్లో సత్తా చాటాడు. గత కొద్దిరోజులు పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. కానీ గత మ్యాచ్లో సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. అతను ఫామ్ను కొనసాగించాలి. ఇలాంటి ప్రదర్శనలే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేస్తాయి.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.