ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న మయాంక్ యాదవ్పై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. దేశవాళీ క్రికెట్ అనుభవం లేకున్నా మయాంక్ యాదవ్ను టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి ఎంపిక చేయాలని సూచించాడు.
అతని బౌలింగ్లో వేగంతో పాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ వేరియేషన్స్ ఉన్నాయని తెలిపాడు. అతన్ని మరో బుమ్రాలా పరిగణించి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిస్తే వరల్డ్ బెస్ట్ పేసర్ అవుతాడని జోస్యం చెప్పాడు.

పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్..
ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మయాంక్ యాదవ్.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్లోనే సంచలన ప్రదర్శనతో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగిస్తూ మరో మూడు వికెట్లు తీసి మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న మయాంక్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

ప్రపంచకప్కు ఎంపిక చేయాలి..
సంచలన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్గా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎమ్మెస్కే ప్రసాద్ ఈ యువ పేసర్పై ప్రశంసల జల్లు కురిపించాడు.
'జెన్యున్ ఫాస్ట్ బౌలర్లు అత్యంత అరుదు. జవగళ్ శ్రీనాథ్తో పాటు ఇతర గొప్ప ఫాస్ట్ బౌలర్లను పరిశీలిస్తే.. వీళ్లలో ఎవరూ కూడా ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడలేదు. ఓ బౌలర్లో పేస్, కచ్చితత్వం, గేమ్ ఇంటలిజెన్స్ ఉన్నాయని భావిస్తే.. అతన్ని నేరుగా అంతర్జాతీయ మ్యాచ్కు ఎందుకు ఎంపిక చేయకూడదు?
అతనికి పరిస్థితులకు తగ్గట్లు వేగాన్ని నియంత్రించుకునే సామర్థ్యం కూడా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిపి మయాంక్ యాదవ్ను బరిలోకి దింపితే టీమిండియా పేస్ అటాక్ చాలా భీకరంగా మారుతోంది.
బుమ్రా కూడా ఇలానే..
మయాంక్లానే గతంలో ఓ యువ పేసర్ ఫాస్టెస్ట్ బాల్స్తో ఆకట్టుకున్నాడు. కానీ అతనికి గేమ్స్ ఇంటలిజెన్స్ లేదు. దాంతో వెనుకపడిపోయాడు. అతను స్టార్ పేసర్గా మారేందుకు చాలా టైమ్ పడుతోంది. కానీ మయాంక్ ఇప్పటికే సీజన్ బౌలర్ అని నిరూపించుకున్నాడు.
కొన్నేళ్ల క్రితం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బుమ్రాను కూడా మేం ఇలానే చూశాం. వెంటనే అతన్ని టీమిండియాకు ఎంపిక చేశాం. అప్పటి నుంచి అతను మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మయాంక్ కూడా అలానే స్టార్ పేసర్ అవుతాడని నాకు అనిపిస్తోంది.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.