తెలుగు తేజం, గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేయడంపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను తీర్చిదిద్దిన ఆటగాడు అత్యున్నత టోర్నీ ఆడటం గర్వంగా ఉందని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్ అరంగేట్రం చేశాడు. గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూసిన ఈ తెలుగు కుర్రాడు.. ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
ఓపెనర్గా బరిలోకి దిగి 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. షేక్ రషీద్ అరంగేట్రం నేపథ్యంలో.. అతని క్రికెట్ ప్రయాణం గురించి ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు.. ఎక్స్వేదికగా పంచుకుంది.

'ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 11 ఏళ్ల వయసులో షేక్ రషీద్ టాలెంట్ గుర్తించి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి ఎంపిక చేశాను. ఆంధ్ర క్రికెట్ అకాడమీ ద్వారా అతన్ని ప్రొఫెషనల్ ఆటగాడిగా తీర్చిదిద్దడం జరిగింది. 13 ఏళ్ల వయసులో షేక్ రషీద్ను యూకేకు పంపించాం. దాదాపు అక్కడ రెండున్నర నెలల పాటు ఉన్నాడు. ఎన్నో మ్యాచ్లు ఆడి చాలా అనుభవాన్ని పొందాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అండర్ 14, 16 క్రికెట్లో బాగా ఆడి అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ ఏడాది 4 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేశాడు.
ఛాలెంజర్స్ ట్రోఫీలో కూడా వరుసగా రెండు శతకాలు కొట్టాడు. ఈ ప్రదర్శనతో అండర్ 19 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ టోర్నీలోనూ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి తన చేతుల మీదుగా ఇండియకు అండర్ 19 ప్రపంచకప్ అందించాడు. అతని ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాంటి ఈ యువ కెరటం.. చెన్నై సూపర్ కింగ్స్కు అరంగేట్రం చేస్తున్నాడంటే.. నాకు అంతకంటే ఏం ఆనందం ఉంటుంది. అతను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.