
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానేను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికచేయడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. మెల్ బోర్న్ టెస్ట్ సెంచరీ తర్వాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదని విమర్శిస్తున్నారు. అయినా సెలెక్టర్లు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారని మండిపడుతున్నారు. అయితే సౌతాఫ్రికా పర్యటనకు రహానేను ఎంపిక చేయడానికి బలమైన కారణం ఉందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ప్రముఖ తెలుగు కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అజింక్యా రహానేకు విదేశాల్లో మెరుగైన రికార్డు ఉందన్నాడు. అందుకే అతన్ని జట్టులోకి తీసుకున్నారని చెప్పాడు.
టెస్టు క్రికెట్లో అతడికి ఉన్న అనుభవం జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు.'విదేశీ పిచ్లపై రహానే మెరుగ్గా రాణించగలడు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతన్ని సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసింది. ప్రస్తుతం రహానే ఫామ్పై కొంత ఆందోళన నెలకొన్నా.. విదేశాల్లో అతనికున్న అనుభవం జట్టుకు కలిసొస్తుందన్న ఆలోచనతో బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలిచినట్లే.. యువ ఆటగాళ్లను కూడా బీసీసీఐ ప్రోత్సహిస్తుంది. జట్టులో అందరికీ సమప్రాధాన్యం ఇస్తుంది. యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు కలిస్తేనే జట్టులో సమతూకం వస్తుంది'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
విదేశాల్లో అజింక్యా రహానే 41.71 సగటుతో మూడు వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రత్యేకించి సేన (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కోహ్లీ (3,551 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రహానే (2,646 పరుగులు) నిలిచాడు. అయితే, గత కొద్ది కాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న రహానే.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన మరో అవకాశాన్ని అతను ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే పేలవ ఫామ్తో రహానే వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ శర్మకు అప్పగించారు.