హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ -2019 జట్టులో తనను ఎంపిక చేయకపోవడం కొందరి పాత్ర ఉందని వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. రాయుడిని తీసుకోవడం, తీసుకోకపోవడం వ్యక్తిగత నిర్ణయం కాదని, ఐదుగురితో కూడిన సెలెక్షన్ కమిటీ సమష్టిగా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు.
ఇటీవలే క్రికెట్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్కే ప్రసాద్తో ఉన్న విభేదాలు 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుండా చేశాయని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లే తన కెరీర్కు అడుగడుగున అడ్డుపడ్డారని తెలిపాడు. ఈ ఆరోపణలపై ఎమ్మెస్కే ప్రసాద్ మరోసారి వివరణ ఇచ్చుకున్నాడు. 'సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. జట్టు ఎంపిక సమయంలో కెప్టెన్ కూడా ఉంటాడు. ఎవరూ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉండదు.
ఎలాంటి నిర్ణయమైనా ఉమ్మడిగా చర్చించి తీసుకోవడం జరుగుతుంది. ఇది సమష్టి నిర్ణయం. నేనే ఏదైనా ప్రతిపాదిస్తే ఇతర సభ్యుల ఆమోదం లభించాలి. అంతేకానీ ఎక్కడా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉండదు.
ఇక 2005 సమయంలో నాకు, రాయుడుకు విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటిదేం లేదు. అతనికి నా కెప్టెన్సీ శైలి నచ్చలేదు. అందులో ఎలాంటి తప్పులేదు. ప్రతి విషయంలోనూ నేను కాస్త కఠినంగా ఉంటా. ఫిట్నెస్, ఆటతీరు ఇలా ప్రతి అంశంలో ఉండటం వల్ల అతడికి నచ్చకపోవచ్చు. అంతేకానీ ఇతర అంశాలు ఏవీ లేవు. అయినా రాయుడితో నాకు కపిల్ దేవ్-గవాస్కర్ మధ్య ఉన్నట్లు ఏమైనా తగదాలున్నాయా?
గట్టు పంచాయితీ ఉందా? అతని వ్యాపార ప్రకటనలను నేనేమైనా లాక్కున్నానా? 2019 వన్డే ప్రపంచకప్ సెలెక్షన్ ప్రక్రియలో నా పాత్ర ఏంటో రాయుడి అంతరాత్మకే తెలుసు. నన్ను డీఫేమ్ చేయడానికి కొందరు పనిగట్టుకొని చేసిన ప్రచారం ఇది. కుల వివక్షతనో రాయుడిని పక్కనపెట్టానని ప్రచారం చేస్తున్నారు. వారందర్నీ నేను అడిగేది ఒక్కటే.. మా కులం వాడిని ఎవరినైనా ఎంపిక చేశానా?.

నేను చీఫ్ సెలెక్టర్ అవ్వడంపై కూడా రకరకాలుగా ప్రచారం చేశారు. కొందరేమో చంద్రబాబు హస్తంతో అంటే.. మరికొందరు వెంకయ్యనాయుడి కారణంగా చీఫ్ సెలెక్టర్ అయినట్లు చెబుతున్నారు. ఇవన్నీ నన్ను డిఫేమ్ చేయడానికి వాడిన ప్రచారాలు.'అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు.
అయితే చంద్రబాబు నాయుడి డైరెక్షన్లో ఎమ్మెస్కే ప్రసాద్ టీడీపీకి అనుకూలమైన ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడని, రాజకీయాల్లో వైసీపీకి మద్దతుగా ఉంటున్న రాయుడిపై ఇదో ఎత్తుగడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.