హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు నాయుడి వల్లనో లేక మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రికమెండ్ చేయడంతోనో తాను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కాలేదని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. తనను డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పనిగట్టుకొని చేసిన ప్రచారం ఇదని ఎమ్మెస్కే స్పష్టం చేశారు.
ఇక క్రికెటర్గా గొప్ప కెరీర్ లేకపోయినా, చీఫ్ సెలెక్టర్గా ఎమ్మెస్కేను ఎంపిక చేయడం వెనుక అదృశ్యహస్తముందని అతనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ నుంచి బీసీసీఐ ఛీప్ సెలెక్టర్గా ఎదిగిన తీరును ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు.

ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తాను చీఫ్ సెలెక్టర్ కాలేదన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు తాను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి దక్కిందన్నాడు. 'ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలతో అప్పటి ప్రెసిడెంట్ గోకరాజు గంగరాజు అడ్మినిస్ట్రేషన్లోకి రావాలని నన్ను ఆహ్వానించారు.
చాముండేశ్వరినాథ్, గోకరాజు గంగరాజుల విభేదాలు రావడంతో తటస్థ వ్యక్తిగా.. క్రికెట్ తెలిసిన వాడిగా నన్ను భావించి ఈ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నేను బీడీఎల్లో ఉద్యోగం చేస్తున్నాను. ముందుగా ఆంధ్రక్రికెట్ అసోసియేషన్లో పనిచేసేందుకు చాలా సంశయించాను. కానీ తల్లి లాంటి అసోసియేషన్ ఇబ్బందుల్లో ఉండటం చూడలేక 28 ఏళ్ల బీడీఎల్ సర్వీస్ను వదలుకొని విజయవాడ వెళ్లాను.
ఆంధ్ర అసోసియేషన్లో 6 ఏళ్లు తీవ్రంగా కష్టపడ్డాను. 13 జిల్లాలు తిరిగి 18 ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ను అభివృద్ది చేశాం. నాలుగు రెసెడెన్షియల్ అకాడమీలు, 2 ఇంటర్నేషనల్ స్టేడియాలను నిర్మించాం. 80 లక్షల ఉపకారవేతనాలు అందించే క్యార్రమం చేపట్టాం. ఈ పని చేసేటప్పుు గోకరాజు గంగరాజు అండగా నిలిచారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నేను చాలా మార్పులు తీసుకొచ్చాను. వీటిని ఎప్పటికప్పుడు బీసీసీఐకి నివేదించేవాడిని. నా సేవలను అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సహా బోర్డు సభ్యులు గుర్తించారు. బీసీసీఐ డైరెక్టర్స్ మీటింగ్లో 40 నిమిషాల పాటు నేను ఇచ్చిన ప్రజంటేషన్కు అందరూ ఫిదా అయ్యారు.
13 జిల్లాల్లో మౌళిక వసతులు డెవలప్ చేయడం, నాలుగు జిల్లాలకు ఓ అకాడమీ పెట్టడం, అమ్మాయిలకు ప్రత్యేకంగా ఓ అకాడమీ ఏర్పాటు చేయడం వంటి పనులు చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ చేసి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 60 కోట్లు పెట్టడాన్ని చూసి మెచ్చుకున్నారు. అప్పుడే అనురాగ్ ఠాకూర్ బీసీసీఐలో పని చేయాలని నాకు కితాబిచ్చారు.
అయితే నేను చాముండేశ్వరినాథ్లా సెలెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పదవికి అప్లే చేశాను. సందీప్ పాటిల్ నాయకత్వంలో సెలెక్టర్గా పని చేశాను. క్రికెటర్లు ఆడే ప్రతీ బంతిని అనాలసిస్ చేసి చెప్పేవాడిని. తదుపరి సెలెక్షన్ కమిటీకి ఇంటర్వ్యూ జరిగినప్పుడు నా పనితీరు నచ్చి సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేశారు. అంతేగానీ, చంద్రబాబు నాయుడుగారో, లేదంటే వెంకయ్య నాయుడుగారో రెకమెండ్ చేయడం వల్ల నాకు ఆ పదవి దక్కలేదు.'అని చెప్పుకొచ్చాడు.