న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ రూల్స్ను రూపొందించే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ధోనీకి శాశ్వత సభ్యత్వాన్ని అందజేసింది. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా, మాజీ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, జులాన్ గోస్వామికి ఎంసీసీ ఈ లైఫ్టైమ్ మెంబర్షిప్ ఇచ్చింది.
కొత్తగా లైఫ్ టైమ్ మెంబర్షిప్స్ అందుకున్న 19 మంది సభ్యుల వివరాలను ఎంసీసీ బుధవారం వెల్లడించింది. భారత్తో పాటు ఇంగ్లండ్ నుంచి కూడా ఐదుగురు మాజీ ప్లేయర్లకు ఈ లైఫ్టైమ్ మెంబర్షిప్ సభ్యత్వం దక్కింది. అలానే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి కూడా మాజీ క్రికెటర్లు ఈ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. ఇందులో 8 టెస్టు దేశాల నుంచి మాజీ క్రికెటర్లకు అవకాశం దక్కగా.. ఒక్క భారత్ నుంచే ఐదుగురు ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్కప్లో కెప్టెన్గా భారత్ జట్టును ధోనీ విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ రెండు మెగా టోర్నీల్లో యువరాజ్ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఇక సురేశ్ రైనా 13 ఏళ్ల వన్డే కెరీర్లో 5,500 పరుగులు చేశాడు. బెస్ట్ బ్యాటర్గా ఫీల్డర్గా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.
భారత మహిళల జట్టుని కెప్టెన్గా సుదీర్ఘకాలం నడిపించిన మిథాలీ రాజ్ 211 ఇన్నింగ్స్ల్లో 7,805 పరుగులు చేసింది. మెగా టోర్నీల్లో రెండు సార్లు భారత్ను ఫైనల్కు తీసుకెళ్లింది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతోంది. ఆమె 204 వన్డేల్లో 255 వికెట్లు తీసింది. ఈ ఇద్దరూ ప్రస్తుతం క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్, కోచ్లుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.