హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో రవీంద్ర జడేజా(15 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో 6, 4 బాదడంతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది.
ఈ గెలుపుతో ఐదో సారి టైటిల్ ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్.. అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. రవీంద్ర జడేజా సంచలన బ్యాటింగ్తో చెన్నై ఓటమిని తప్పించుకుంది. ఒక వేళ జడేజానే చివరి రెండు బంతులకు 10 పరుగులు చేయకుంటే గుజరాత్ ఛాంపియన్గా నిలిచేది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యేవి.

ముఖ్యంగా ధోనీ హేటర్స్.. చెన్నై సారథిని సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకునేవారు. గౌతమ్ గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లు ధోనీని తీవ్రంగా విమర్శించేవారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. అనంతరం చెన్నై లక్ష్య చేధనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. చాలా సేపు ఆట ఆగిపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం రహానే, అంబటి రాయుడు క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగారు. రాయుడు ఔటైన వెంటనే క్రీజులోకి ధోనీ రాగా.. చెన్నై విజయానికి 14 బంతుల్లో 22పరుగులు అవసరమయ్యాయి.
కానీ మోహిత్ శర్మ.. ధోనీని గోల్డెన్ డకౌట్ చేయగా... హ్యాట్రిక్ బాల్ను జడేజా సింగిల్ తీసాడు. దాంతో చివరి 12 బంతుల్లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మహమ్మద్ షమీ వేసిన 14 ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. దాంతో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి.
ఇక్కడ ధోనీ వికెట్ గుజరాత్ టైటాన్స్కు మూమెంటమ్ అందించగా.. చెన్నై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. సునాయస గెలవాల్సిన మ్యాచ్ను చెన్నై ధోనీ కారణంగా కష్టపడి గెలవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో చెన్నై గెలవకుంటే ధోనీ హేటర్స్ ఇదే కారణాన్నిచూపి ట్రోలింగ్కు దిగేవారు.