సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రాంచీకి వచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషభ్ పంత్కు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దావత్ ఇచ్చాడు. గురువారం రాత్రి తన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఈ దావత్ పూర్తయిన అనంతరం ధోనీనే స్వయంగా తన కారులో విరాట్ కోహ్లీని టీమ్ హోటల్కు తీసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇక తన కుటుంబంతో లండన్లో నివసిస్తున్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం బుధవారం భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరగనుంది. దాంతో జట్టుతో కలిసి కోహ్లీ రాంచీ వచ్చాడు. తమ హోమ్ టౌన్కు వచ్చిన కోహ్లీ, పంత్లకు ధోనీ తన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. ధోనీ నివాసానికి కోహ్లీ వచ్చిన వీడియోలు.. తిరిగి ధోనీ హోటల్ గదిలో దిగబెట్టిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
కోహ్లీ రాకను తెలుసుకున్న ఫ్యాన్స్.. పెద్ద ఎత్తున ధోనీ ఇంటి వద్దకు చేరుకున్నారు. కోహ్లీ, కోహ్లీ.. అని గట్టిగా నినాదాలు చేశారు. అభిమానులను పోలీసులు అదుపు చేసి కోహ్లీని ధోనీ ఇంట్లోకి తీసుకెళ్లారు. రాంచీ వేదికగా చివరిసారిగా భారత్ గతేడాది ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. తన కొడుకు అకాయ్ జన్మించడంతో ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.

రాంచీ వేదికగా భారత్ మ్యాచ్లు జరిగిన ప్రతీ సారి టీమ్ మొత్తానికి ధోనీ తన ఇంట్లో దావత్ ఇచ్చాడు. ఈ సారి మాత్రం కోహ్లీ, పంత్లను మాత్రమే ఆహ్వానించాడు. నవంబర్ 30న ఈ మ్యాచ్ జరగనుండగా.. ఆలోపు జట్టు మొత్తాన్ని ధోనీ తన ఇంటికి ఆహ్వానించే అవకాశం ఉంది.
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో 0-2తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలవాలనే కసితో ఉంది. ఈ సిరీస్కు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో దూరమయ్యారు. దాంతో ఈ సిరీస్లో జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. టీ20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోల పలికిన కోహ్లీ.. కేవలసం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. ఆసీస్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో మాత్రం అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత వన్డే టీమ్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), కీపర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్