న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ ఆడుతున్నా.. మైదానాలన్నీ జనాలతో కిక్కిరీసిపోవడమే కాకుండా పసుపుమయం అవుతున్నాయి. టీవీ, ఓటీటిల్లో రికార్డు వ్యూస్ వస్తున్నాయి.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కరే ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడంటే అతని చరిష్మా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆటగాడిగా ధోనీకి తిరుగులేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావి. తన అనుకునే వారికి ఏమైనా చేయగలిగే వ్యక్తి. ధోనీ గురించి చెప్పడానికి పేజీలు సరిపోవు. అయితే ఒక్క విషయంలో మాత్రం ధోనీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. జనాల మనసులో ఛీటర్గా ముద్ర వేసాయి.

పాపులారిటీతో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్గా మారిన ధోనీ.. అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. అతన్ని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. అంబాసిడర్గా ఉంచుకునేందుకు బడా కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే ప్రచారకర్తగా ధోనీ ప్రజాక్షేమం పట్టించుకోడనే అపవాదు ఉంది. ప్రజాక్షేమం కంటే డబ్బులకే ప్రాధాన్యత ఇస్తాడనే విమర్శల కూడా వచ్చాయి.
ఆమ్రపాలి హౌసింగ్ స్కామ్తో ధోనీకి తొలిసారి చెడ్డపేరు వచ్చింది. ఈ సంస్థకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించడంతో చాలా మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. కానీ సదరు కంపెనీ బోర్డు తిప్పేయడంతో రోడ్డున పడ్డారు. ధోనీ కూడా తనకు సంబంధం లేదన్నట్లు వ్యహరించాడు. అంతేకాకుండా సదరు సంస్థ తననే చీటింగ్ చేసిందంటూ కోర్టును ఆశ్రయించాడు.
ఇదే కాదు.. ఇతర కంపెనీల విషయంలోనూ ధోనీ ప్రజా క్షేమం పట్టించుకోడని తాజాగా ఓ రిపోర్ట్ పేర్కొంది. అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యూలేటరీ బాడీ (ఏఎస్సీఐ) బయటపెట్టిన వివరాల ప్రకారం ప్రజాక్షేమం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసుకుంటూ పోతున్న సెలబ్రేటీల జాబితాలో ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు.
అడ్వర్టైజింగ్ నిబంధన ప్రకారం.. ప్రచారం చేసే ఆ వస్తువు నాణ్యత గురించి, సంస్థ ప్రమాణాల గురించి తెలుసుకుని, అది సరైనదా? కాదా? అనే విషయాలపై ప్రచారకర్తకు అవగాహన ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా చాలా మంది సెలెబ్రిటీలు డబ్బుల కోసం ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ జాబితాలో ధోనీ తర్వాత యూట్యూబ్ కమెడియన్ భువన్ బామ్ ఉన్నాడు.
గత 55 ఏళ్లలో ఇలా సెలబ్రిటీల కారణంగా మోసపోయామని వస్తున్న ఫిర్యాదులు 80.3 శాతం పెరిగాయట. 503 ప్రకటనలపై ఫిర్యాదు వచ్చినట్టు ఏఎస్సీఐ తెలిపింది. ఆన్లైన్ గేమింగ్తో పాటు క్లాసికల్ ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్ వంటి వివిధ విభాగాలకు చెందిన యాడ్స్ ద్వారా జనాలు ఎక్కువగా మోసపోతున్నారు. చట్టంలో ఉండే లొసుగులతో సెలెబ్రిటీలు ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు.