
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం అన్ని జట్ల కన్నా ముందే చెన్నై సూపర్ కింగ్స్ ప్రిపరేషన్స్ మొదలెట్టనుంది. ఐపీఎల్ 2020 సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 7 స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించింది. ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత క్రికెటర్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి వరకూ లీగ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ భారత్లోనే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ కోసం క్యాంప్ను చెన్నై వేదికగా మార్చి 11 నుంచి ప్రారంభించబోతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. ఈ ప్రాక్టీస్ శిభిరానికి మొదటి రోజే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సీనియర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనాతో పాటు కొంత మంది యువ క్రికెటర్లు కూడా హాజరవుతారని సదరు అధికారి పేర్కొన్నాడు. గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ, రైనా నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో.. ప్రస్తుతం ఖాళీగానే ఉన్న ఈ ఇద్దరూ ఆటకు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ ప్రాక్టీస్ క్యాంప్ మొదటిరోజే హాజరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట కూడా ఇలానే చెన్నైలో ఓ క్యాంప్ని ఆ ఫ్రాంఛైజీ ఏర్పాటు చేయగా.. టీమ్ యూఏఈకి వెళ్లగానే అక్కడ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కరోనా బారిన పడ్డారు. ఇది ఆ జట్టును తీవ్రవంగా ప్రభావం చేసింది.
ఐపీఎల్ 2021 సీజన్ కోసం కొత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్ ఆల్రౌండర్లు మొయిన్ అలీ, కె. గౌతమ్, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా వచ్చారు. ఐపీఎల్ 2021 సీజన్కు బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 6 సిటీల్లో చెన్నైకి కూడా చోటు లభించింది.