చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ధోనీ జెర్సీ నెంబర్ 7ను మిస్సవుతున్నామని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ట్వీట్ను చూసి ధోనీ అభిమానులను అయోమయానికి గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన ధోనీ కెప్టెన్గా ఐదు టైటిళ్లు అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సీఎస్కేను రెండు సార్లు విజేతగా నిలబెట్టాడు. గతేడాదే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ను సారథ్యంలో వికెట్ కీపర్గా కొనసాగాడు.

ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న ధోనీ వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేదానిపై గతేడాదిగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం రూల్స్ను బీసీసీఐ ప్రకటించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ స్పష్టం చేశాడు. మరోవైపు ధోనీ కోసం సీఎస్కే ఫ్రాంచైజీ.. ఓ పాత రూల్ను మళ్లీ అమలు చేయాలని బీసీసీఐని కోరుతోంది.
ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించేవాళ్లు. ఈ నిబంధన 2018 వరకు అమల్లో ఉంది. ఆ తర్వాత ఈ రూల్ను తొలగించారు. ధోనీ కోసం మళ్లీ ఈ రూల్ను అమలు చేయాలని సీఎస్కే డిమాండ్ చేసింది. కానీ ఇతర ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. అప్పటి నుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో అనామక ప్లేయర్గా ధోనీని రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావించింది. దాంతో వచ్చే సీజన్లో ధోనీ ఆడుతాడని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ధోనీ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. వైద్యుల సలహా మేరకే అతను వచ్చే సీజన్ ఆడాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే ధోనీ కీళ్ల నొప్పులు సమస్య తగ్గలేదని, దాంతోనే అతను ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ ట్వీట్లో ధోనీ జెర్సీ ఫొటోను పంచుకున్న సీఎస్కే.. మేజర్ మిస్సింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. వచ్చే సీజన్ నుంచి ధోనీ అందుబాటులో ఉండడని సీఎస్కే హింట్ ఇస్తోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధోనీ దూరమైతే.. సీఎస్కేను ఎవరు పట్టించుకోరని కూడా అంటున్నారు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 234 మ్యాచ్లు ఆడిన ధోనీ 4669 పరుగులు చేశాడు. ఓవరాల్గా 264 మ్యాచ్ల్లో 5243 రన్స్ చేశాడు.