
దుబాయ్ : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అందరి మనసులు గెలుచుకున్నాడు. కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను యూఏఈకి తరలించాయి. ఇక ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కూడా శుక్రవారమే ప్రత్యేక విమానంలో దుబాయ్కి బయలుదేరి వెళ్లింది. జట్టుతో పాటే సీఎస్కే మేనేజర్ కె జార్జ్ జాన్ కూడా వెళ్లాడు. అయితే విమాన ప్రయాణంలో ధోనీతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణని జార్జ్ తన ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు.
ధోనీకి కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటులో తనను కూర్చోబెట్టి.. అతను మాత్రం ఎకానమీ సీటులో వెళ్లి కూర్చున్నాడని జార్జ్ పేర్కొన్నాడు. ఇదే విషయంపై ధోనీని అడిగితే..' మీ కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి.. మీకు ఎకానమీ క్లాస్ సీటు సరిపోదు.. వచ్చి నా బిజినెస్ క్లాస్ సీటులో కూర్చొండి.. నేను వెళ్లి మీ సీటులో కూర్చుంటా'అని బదులిచ్చాడని జార్జ్ చెప్పాడు. తన సహచరులతో కలిసి కూర్చునేందుకే మహీ ఇదంతా చేశాడన్నాడు. జార్జ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇక ధోనీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడని, అతనెప్పుడూ కూల్ కెప్టెనే.. ధోని లాంటి వ్యక్తులు నూటికి ఒక్కరుంటారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2020 సీజన్లో పాల్గొనేందుకు కోల్కతా నైటరైడర్స్, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గురువారమే యూఏఈ చేరుకోగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్లో అడుగుపెట్టాయి. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు ఒకే విమానంలో ఆదివారం యూఏఈకి పయనమయ్యాయి. 'మాది సన్రైజర్స్ టీమ్ ఈ రోజు దుబాయ్ పోతుంది'అనే క్యాప్షన్తో ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్ల ప్రయాణ ఫొటోలను పంచుకుంది.
ప్రయాణానికి ముందే ఆటగాళ్లందరికి రెండు సార్లు కరోనా పరీక్షలు చేశారు. దుబాయ్ చేరుకున్న తర్వాత ఏడు రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ సమయంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మూడింటిలో నెగెటివ్ వస్తే బయో బబుల్లోకి అనుమతిస్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్13వ సీజన్లో మొత్తం 60 మ్యాచ్లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో జరగనున్నాయి.