
రాయ్పూర్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు.! అది కూడా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడిగా! అవును మీరు చదివిందే నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్టాపిక్ మారింది. ఒక ఆకతాయి చేసిన పనికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తోడవ్వడంతో సచిన్ కొడుకుగా ధోనీ టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
ఛత్తీస్గఢ్లో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. అప్లయ్ చేసిన వారిలో ఓ 15 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ఆ జాబితాలో తొలిపేరు మహేంద్ర సింగ్ ధోనీ సన్నాఫ్ సచిన్ టెండూల్కర్ పేరు ఉండటం గమనార్హం. ఆ దరఖాస్తు ప్రకారం ఎంఎస్ ధోనీ, రాజ్పూర్ జిల్లా వాసని, సీఎస్వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఈ దరఖాస్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు.. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. అయితే 15 మంది సభ్యుల్లో 14 మంది రాగా.. ధోనీ పేరిట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి రాలేదు. దాంతో అధికారులు అప్లికేషన్లో ఉన్న మొబైల్ నెంబర్కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది.
దాంతో అది ఫేక్ అప్లికేషన్ అని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారాయి. ఇక ఫేక్ అప్లికేషన్తో తమ ఇజ్జత్ తీసిన ఆకతాయిపై కేసు పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే ఇదే తరహాలో సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ బిహార్లో టీచర్ ఉద్యోగానికి ఎంపికైన విషయం వైరల్గా మారిన సంగతి తెలిసిందే.